ఆర్మూర్టౌన్: రోడ్డు ప్రమాదాల నివారణను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. ‘మన ఊరు మన భద్రత, మన బాధ్యత’ కార్యక్రమంలో భాగంగా డివిజన్లోని ప్రజాప్రతినిధులకు పట్టణంలోని మీనాక్షి ఫంక్షన్ హాల్లో గురువారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. రోడ్డుపై ధాన్యాన్ని ఆరబోయడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, ధాన్యం ఆరబోయాల్సి వస్తే భద్రత కోన్లు లేదా బకెట్కు రేడియం స్టిక్కర్లు అతికించాలన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ వాహనాలు నడిపితే ప్రమాదాలను నివారించవచ్చన్నారు. అలాగే డ్రగ్స్ నిర్మూలనను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలన్నారు. అదనపు డీసీపీ జీ బస్వారెడ్డి, ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ గోనె లహరిరఘు, వైస్ చైర్మన్ కాటిపల్లి గంగారెడ్డి, ఏసీపీ వెంకటేశ్వర్రెడ్డి, సైబర్ క్రైం ఏసీపీ వెంకటేశ్వర్లు, ఎస్హెచ్వో సత్యనారాయణగౌడ్, రూరల్ సీఐ జాన్రెడ్డి, ఎస్సైలు , కౌన్సిలర్లు, సర్పంచ్లు పాల్గొన్నారు.


