హత్యలు.. చోరీలు.. ప్రమాదాలు
● సంచలనం సృష్టించిన కానిస్టేబుల్ ప్రమోద్ హత్య
● హంతకుడు రియాజ్ ఎన్కౌంటర్కు
ప్రజల నుంచి మద్దతు
● జిల్లాలో పెరిగిన చోరీలు, సైబర్ నేరాలు
● నిర్లక్ష్యపు డ్రైవింగ్తో రోడ్డు ప్రమాదాలు
● 2025 ఇయర్ క్రైం రౌండప్
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది క్రైం రేట్ పెరిగింది. ప్రధానంగా రియాజ్ అనే బైక్ చోరీ నిందితుడిని అక్టోబర్ 17న పోలీసు స్టేషన్కు తరలిస్తుండగా కానిస్టేబుల్ ప్రమోద్ను నగరంలోని వినాయక్నగర్లో నడిరోడ్డుపై కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. హంతకుడు రియాజ్ను పట్టుకున్న పోలీసులు అక్టోబర్ 21న జీజీహెచ్కు తరలించగా, అక్కడ అతను పోలీసుల గన్ లాక్కొని దాడికి ప్రయత్నించాడు. దీంతో పోలీసులు రియాజ్ను ఎన్కౌంటర్ చేశారు. ఈ ఎన్కౌంటర్కు ప్రజల నుంచి పోలీసులకు మద్దతు లభించింది.
● జిల్లాలో రోడ్డు ప్రమాదాలు పెరిగాయి. నిర్లక్ష్యపు డ్రైవింగ్, మద్యం మత్తులో ఈ ప్రమాదాలు జరిగాయి. జిల్లాలో 680 రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకోగా 272 మంది ప్రాణాలు కోల్పోయారు. 510 మందికి గాయాలయ్యాయి. జాతీయ రహదారులపై 260 ప్రమాదాలు జరిగాయి. 330 మంది చనిపోయారు. జిల్లా కేంద్రంలోని అర్సపల్లి వద్ద మూలమలుపు రోడ్డు ప్రమాదాల్లో రాష్ట్రంలోనే 20వ స్థానంలో నిలిచింది. మూడేళ్లలో ఇక్కడ 19 మంది చనిపోయారు. మరోవైపు జిల్లాలో ఈ ఏడాది 33 గంజాయి కేసులు పట్టుకున్నారు.
● ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు, ఆర్మూర్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ వివేకానందరెడ్డి, నిజామాబాద్ అర్బన్ సబ్ రిజిస్ట్రార్ రామరాజులు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.
● సంచలనం సృష్టించిన మాక్లూర్లో ఆరుగురి హత్య కేసులో సెప్టెంబర్ 2న బాధ్యులైన ఐదుగురికి జిల్లా కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.
సైబర్ నేరాలు.. ఛేదన
జిల్లాలో సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. నవంబర్ నెలలో నిజామాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు భారీ అచీవ్మెంట్ సాధించారు. విదేశీ లింకులు సైతం ఛేదించారు. వివిధ రాష్ట్రాల్లో పక్కా ఆపరేషన్ నిర్వహించి 81 మంది సైబర్ నేరగాళ్లను అరెస్టు చేశారు. ఆన్లైన్ ట్రేడింగ్ పేరిట విదేశీ లింకులతో మోసాలు చేస్తున్నవారిలో నిజామాబాద్కు చెందిన వ్యక్తి కీలకపాత్ర ఉండడాన్ని రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు గుర్తించారు. దీనిపై నిజామాబాద్ పోలీసులు రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా 25 రోజులపాటు వివిధ రాష్ట్రాల్లో భారీ ఆపరేషన్ నిర్వహించారు. అక్టోబర్ నెలలో మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లలో ఈ ఆపరేషన్ నిర్వహించి 81 మందిని అరెస్టు చేశారు. ఇందులో ఆన్లైన్ ట్రేడింగ్, ఫారెక్స్ మోసాలు చేస్తున్న నేరగాళ్లను పట్టుకున్నారు. నిజామాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు షేక్ బాషా సుల్తాన్ అనే వ్యక్తిని అరెస్టు చేసి వరుసగా ఈ రాకెట్ను ఛేదించారు. ఇతనికి భారతదేశంలో మొత్తం 26 సైబర్ క్రైమ్ కేసులతో సంబంధం ఉన్నట్లు తెలుసుకున్నారు. ఇందులో మూడు కేసులు తెలంగాణలో ఉన్నాయి. ఇతను విదేశీ సైబర్ నేరగాళ్లకు బ్యాంక్ అకౌంట్లు సరఫరా చేశాడు. సదరు విదేశీ సైబర్ నేరగాళ్లు భారతదేశ డిజిటల్ బ్యాంకింగ్ నెట్వర్క్లను పెద్ద మొత్తంలో మోసపూరిత డబ్బు బదిలీల కోసం వాడుకున్నారు. దీన్ని ఛేదించడంలో రాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు అత్యంత పకడ్బందీగా వ్యవహరించ డం గమనార్హం. నకిలీ ఆన్లైన్ ట్రేడింగ్ ప్లాట్ఫా మ్ ద్వారా రూ.7.75 లక్షలు మోసం చేయడంతో నిజామాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు నమోదు చేసిన కేసు విచారణ ద్వారా ఈ లింకులు కనుక్కుంటూ వెళ్లారు. బాధితుడిని వాట్సాప్ ద్వారా ఒక మోసగాడు సంప్రదించడంతో ఈ మోసం చేసే వ్యవహారం మొదలైంది. ‘అన్యాశర్మ’ పేరుతో వాట్సప్లోకి వచ్చిన సదరు మోసగాడు బాధితుడిని ఒప్పించి, ఒక నకిలీ ఫారెక్స్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో రూ.7.75 లక్షలు పెట్టుబడి పెట్టించాడు. ఆ ప్లాట్ఫామ్లో నకిలీ డాష్ బోర్డులు, తప్పుడు లాభాలు చూపించాడు. తర్వాత ఆ డబ్బులను వేరువేరు రాష్ట్రాల్లోని వివిధ మ్యూల్ అకౌంట్లలోకి పంపించారు. అయితే ఈ దర్యాప్తులో విదేశీ హ్యాండ్లర్ల కోసం పనిచేసే అకౌంట్ సప్లయర్ల నెట్వర్క్ సైతం బయటపడింది.
వ్యవస్థీకృత క్రైమ్ సిండికేట్..
షేక్ బాషా సుల్తాన్కు దుబాయ్లో ఉన్న రామేశ్వర్ సహాన్, రాజేష్ షా అనే ఇద్దరు నేపాల్ వ్యక్తులతో నే రుగా సంబంధాలు ఉన్నట్లు పోలీసులు దర్యాప్తులో తెలుసుకున్నారు. ఈ విదేశీ హ్యాండ్లర్లు ఆన్లైన్ ట్రే డింగ్, గేమింగ్, ఇన్వెస్ట్మెంట్ మోసాల నుంచి వ చ్చిన డబ్బును లాండరింగ్ చేయడానికి భారతీయ బ్యాంక్ అకౌంట్లు సేకరించారు. ఈ గ్రూపు హైదరాబాద్, నోయిడా, ముంబై, నెల్లూరుకు వెళ్లింది. అక్క డ నేపాల్ వాసుల ద్వారా చైనీస్ లింకులు కలిగిన ఆపరేషన్లు చేసేవాళ్లకు బ్యాంక్ అకౌంట్ వివరాలు అప్పగించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు దుబాయ్లో ఉన్న ఆ ఇద్దరు మాస్టర్ మైండ్ల మీద లుక్అవుట్ సర్క్యులర్లు జారీ చేశారు. తద్వారా ఈ కేసును ఛేదించారు.
402 దొంగతనాలు
జిల్లాలో ఈ సంవత్సరం 402 దొంగతనాలు నమోదయ్యాయి. ఇందులో రూ.2,21,13,490 విలువైన సొత్తును రికవరీ చేశారు. 489 వాహనాలు అపహరణకు గురికాగా, 151 వాహనాలను పోలీసులు రికవరీ చేశారు. 672 పేకాట కేసులు నమోదుకాగా, రూ.72 లక్షలు స్వాధీనం చేసుకొని 2,570 మందిని అరెస్టు చేశారు. ఇతర కేసులు, గృహహింస కేసులు 210, వరకట్నం కేసులు 48, అత్యాచార ఘటన కేసులు 14, ఛీటింగ్ కేసులు 40 నమోదయ్యాయి. ఈ ఏడాది 12,892 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. జిల్లా కేంద్రంలో డిసెంబర్ 27న తెల్లవారుజామున 4వ, 5వ టౌన్ పోలీసు స్టేషన్ల పరిధిలో రెండు ఏటీఎంలను ధ్వంసం చేసిన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో రూ.50 లక్షల వరకు నగదు దోపిడీ కాగా, ఏటీఎం యంత్రాలు దగ్ధమయ్యాయి.
21 చైన్ స్నాచింగ్లు
ఈ ఏడాది జిల్లాలో 21 చైన్ స్నాచింగ్ ఘటనలు చోటుచేసుకున్నాయి. డిసెంబర్లో మహాలక్ష్మినగర్లో, కసబ్గల్లీల్లో వేర్వేరు ఘటనల్లో మహిళల మెడలోని బంగారు ఆభరణాలను లాక్కెళ్లారు. బైక్పై వచ్చిన ఇద్దరు దుండగులు ఇంటి ముందు ముగ్గు వేస్తున్న మహిళల మెడలో ఉన్న గొలుసులను లాక్కెళ్లడం కలకలం రేపింది.
జిల్లాలో ఈ ఏడాది నేరాల సంఖ్య పెరిగింది. ప్రధానంగా సైబర్ మోసాలు పెరుగుతూ వస్తున్నాయి. డ్రంకెన్ డ్రైవ్, నిర్లక్ష్యపు డ్రైవింగ్తో రోడ్డు ప్రమాదాలు పెరిగాయి. ఇళ్లలో చోరీలు, బైక్ దొంగతనాలు, చైన్స్నాచింగ్లు సైతం అధికమయ్యాయి. 2025 ఏడాది ముగింపు సందర్భంగా ఇయర్ క్రైం రౌండప్.
హత్యలు.. చోరీలు.. ప్రమాదాలు
హత్యలు.. చోరీలు.. ప్రమాదాలు
హత్యలు.. చోరీలు.. ప్రమాదాలు


