
నష్టపోయిన రైతులకు అండగా ఉంటాం
ధర్పల్లి/సిరికొండ: అధైర్య పడొద్దని అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన ప్రతి రైతునూ ప్రభు త్వం ఆదుకుంటుందని నిజామాబాద్ రూరల్ ఎ మ్మెల్యే భూపతిరెడ్డి భరోసా ఇచ్చారు. ధర్పల్లి, సిరికొండ మండలాల్లోని మద్దుల్తండా, వాడి, హొన్నాజీపేట్, సీతాయిపేట్, చీమన్పల్లి, కొండూర్ గ్రామాల్లో ఆదివారం ఆయన పర్యటించి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధర్పల్లి, సిరికొండ మండలాల్లోనే పంట నష్టం ఎక్కువగా ఉందన్నారు. పంట నష్టం పై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసి వివరించినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పంటల నష్టం పై పూర్తిస్థాయి నివేదిక ప్రభుత్వానికి అందగానే నష్టపరిహారం పై ఒక నిర్ణయం తీసుకుంటారన్నారు. గతేడాది రబీ సీజన్లో వడగళ్ల వానతో పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులకు పరిహరం ఇచ్చామని గుర్తు చేశారు. ఆయన వెంట నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి భాస్కర్రెడ్డి, బాడ్సి శేఖర్గౌడ్, ధర్పల్లి, సిరికొండ మండలాల పార్టీ అధ్యక్షులు ఆర్మూర్ బాలరాజ్, బాకారం రవి, సొసైటీ చైర్మన్ గంగాధర్, ఏఎంసీ డైరెక్టర్లు సంపత్రెడ్డి, ముత్తెన్న, ఏడీఏ ప్రదీప్కుమార్, ఏవో నర్సయ్య, నాయకులు ఉన్నారు.
త్వరితగతిన ధాన్యం కొనుగోళ్లు
ధాన్యాన్ని త్వరితగతిన కొనుగోలు చేస్తామని ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. సొసైటీ ఆధ్వర్యంలో సిరికొండ మండలం కొండూర్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. రైతులు ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోకుండా ప్రభుత్వ కేంద్రాల్లోనే విక్రయించాలని సూచించారు.
అకాల వర్షం ఆగం చేసింది..
తనకున్న ఎకరం భూమిలో సాగు చేసిన వరి పూర్తిగా దెబ్బతిన్నదని ధర్పల్లి మండలం వాడి గ్రామానికి చెందిన మహిళా రైతు జిన్న రాజమణి ఎమ్మెల్యే ఎదుట రోదించింది. పంట పొట్టదశలో ఉండగా బోరు ఎత్తిపోయిందని, మరో బోరుకు రూ.15వేలు అద్దె చెల్లించి నీరందించిన తరువాత అకాల వర్షం కురిసిందని ఆమె కన్నీటిపర్యంతమైంది. తన భర్త జీవనోపాధికోసం గల్ఫ్కు వెళ్లాడని, తమది పేద కుటుంబమని తెలిపింది. దీంతో ఎమ్మెల్యేతోపాటు అధికారులు చలించారు. నష్టపరిహారం అందేలా చూస్తామని ఆమెకు భరోసా ఇచ్చారు.

నష్టపోయిన రైతులకు అండగా ఉంటాం