మొరం తవ్వకాలు
కుభీర్: మండలంలోని పలు గ్రామాల్లో అనుమతుల్లేకుండానే కొండలను తోడేస్తూ యథేచ్ఛగా మొరం(మట్టి)ని తరలిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకనే పర్యావరణ పరిరక్షణకు దోహదపడే పచ్చని కొండలు కనుమరుగవుతున్నాయి. అటవీశాఖ, ప్రభుత్వ అసైన్డ్ భూముల్లో ఉన్న ఈ కొండల నుంచి మొరం తరలిస్తూ కొందరు అక్రమార్కులు లాభాలు గడిస్తున్నారు. రాజకీయ పార్టీల నాయకుల అండదండలు ఉండటంతోనే మొరం తవ్వకాలను అధికారులు పట్టించుకోవడం లేదని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. దీనిపై కథనం..
కుభీర్ మండలంలో 42 గ్రామపంచాయతీ లు న్నాయి. మండలంలోని సిర్పెల్లి, పల్సి, జామ్గా ం, దొడర్నా, రాంనాయక్తండా, ఫకీర్నాయక్తండా, దౌజీనాయక్తండా, బెల్గాం,వీర్గాం, బ్రహ్మేశ్వ ర్, శివుని, రంజని గ్రామపంచాయతీల పరిధిలో కొండలను ఇష్టానుసారం తవ్వేస్తున్నారు. అధి కారుల దృష్టికి వచ్చినప్పుడు మందలించి వదిలేస్తున్నారు. దీంతో కొంత సమయం తవ్వకాలు నిలిపివేసి.. మళ్లీ త్రవ్వకాలు ప్రారంభిస్తున్నారు. కొన్ని సార్లు అభివృద్ధి పనుల పేరు చెప్పి పలువురు రా జ కీయ నాయకులు అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు.
ఇప్పటికైనా స్పందించాలి..
పర్యావరణానికి నష్టం వాటిల్లకుండా కొండలను ఇష్టానుసారం తవ్వడం, మొరం తరలించడం వంటి చర్యలు అడ్డుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
పర్యావరణం కాపాడాలి
కొండలను తవ్వకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. నిబంధనలకు విరుద్ధంగా మట్టిని తరలిస్తే పర్యావరణ సమతుల్యం దెబ్బతిని భూగర్భజలాలు అడుగంటుతాయి.
– గంగాశేఖర్, కుభీర్
మా దృష్టికి వస్తే చర్యలు
అక్రమంగా మొర్రం తవ్వకాలు జరుపుతున్నట్లు మా దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటాం. ఆర్ఐలతో చెప్పి పొక్లెయిన్ యజమానులతో సమావేశం నిర్వహించి.. మొరం తవ్వకాలు చేపట్టొద్దని ఆదేశిస్తాం.
– శ్రీదేవి, తహసీల్దార్, కుభీర్
నిబంధనలు ఇవీ..
ప్రభుత్వ భూముల్లో మొరం తవ్వాలంటే రెవెన్యూశాఖ, భూగర్భజల వనరులశాఖ అనుమతి తప్పనిసరి. ఇందుకు కొంత రాయల్టీ చెల్లించాల్సి ఉంటుంది. అధికారులు అనుమతి పత్రాలు పరిశీలించి పర్యావరణ పరిరక్షణకు నష్టం వాటిల్లకుండా నిర్ణీత మీటర్లలో తవ్వకాలు చేపట్టాలని సూచిస్తూ అనుమతులు మంజూరు చేస్తారు.


