ప్రభుత్వ వైద్యుడు డాక్టర్ దేవేందర్రెడ్డి ఎంబీబీఎస్ సీట్లు సాధించిన ఐదుగురికి సన్మానం ముత్తవ్వకు ఏటా రూ.25 వేలు ఇస్తానని ప్రకటన
లోకేశ్వరం: ఎంబీబీఎస్ సీట్లు సాధించడం ఎంత ముఖ్యమో.. ఉత్తమ వైద్యులుగా ఎదగడం అంతకన్నా ముఖ్యమని, ఉత్తమ వైద్య సేవలందిస్తేనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని నిర్మల్ ప్రముఖ ప్రభుత్వ వైద్యుడు డాక్టర దేవేందర్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో ఎంబీబీఎస్ సీట్లు సాధించిన లోకేశ్వరానికి చెందిన మెండె సాయిచైతన్య, తోకల ముత్తవ్వ, మేఘన, ధర్మోరకు చెందిన మనీష్, భాగాపూర్కు చెందిన హర్షనవ్యశ్రీను శుక్రవారం సన్మానించారు. అనంతరం దేవేందర్రెడ్డి మాట్లాడుతూ తాము చదువుకునే రోజుల్లో ఉమ్మడి రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లు కేవలం 1100 మాత్రమే ఉండేవని, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోనే 13 వేలు ఉన్నాయన్నారు. ఇప్పటి నుంచే లక్ష్యాన్ని నిర్ధేశించుకుని పీజీతోపాటు స్పెషలైజేషన్ పై దృష్టిసారిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని సూచించారు. చిన్నతనంలో తల్లిదండ్రులు కోల్పోయినా పట్టుదలతో చదివి సీటు దక్కించుక్నున తోకల ముత్తవ్వకు ఐదు ఏళ్లు వైద్య విద్యకయ్యే ఖర్చును తానే భరిస్తానని హామీ ఇచ్చారు. మొదటి ఏడాది ఫీజు కింద రూ.25 వేల చెక్కును అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ దర్వాడి కపిల్, మాజీ సర్పంచ్ మెండె శ్రీధర్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు భూజంగ్రావు, నాయకులు సురేశ్రావు, విజయరావ్, నరేందర్రెడ్డి, ముత్తన్న, రమణారావు పాల్గొన్నారు.


