ఐదు రోజుల్లో భార్యకు ప్రసవం భర్తను కబళించిన రోడ్డు ప్రమాదం అత్తవారింటికి వెళ్తుండగా ఘటన వైఎస్సార్ మరణం తట్టుకోలేక నాడు తండ్రి మృతి
పెంబి: ఐదు రోజుల్లో భార్యకు ప్రసవం జరగాల్సి ఉంది. నెల క్రితం కాన్పు కోసం పుట్టింటికి పంపించాడు. తొలి కాన్పు సమయంలో ఆమె వెంట ఉండాలనుకున్నాడు భర్త. ఈమేరకు శుక్రవారం రాత్రి అత్తవారింటికి బయల్దేరాడు. ఇంతలోనే మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో కబళించింది. ఈ విషాద ఘటన ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం మాట్లొద్ది వద్ద జరిగింది. మృతుడు కూడా తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కొడుకు కావడం విషాదకరం.
మూడేళ్ల క్రితం వివాహం..
నిర్మల్ జిల్లా పెంబి మండలం తాటిగూడ గ్రామానికి చెందిన జాదవ్ అనిల్(30)కు ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం మాట్లొద్దికి చెందిన స్రవంతితో మూడేళ్ల క్రితం వివాహమైంది. అనిల్ తండ్రి జాదవ్ మాంగ్య 2009లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ మర ణం తట్టుకోలేక మరణించా డు. అప్పటి నుంచి తల్లి అని ల్, కూతురును పెంచి పెద్ద చేసి పెళ్లిళ్లు చేసింది. అనిల్ వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
నెలక్రితం భార్యను
పుట్టింటికి పంపి..
తన భార్య స్రవంతి గర్భం దాల్చడంతో తొలిచూరు కాన్పు కోసం నెల క్రితం పుట్టింటికి పంపించాడు. మరో ఐదు రోజుల్లో ప్రసవం జరిగే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. దీంతో భార్య అనిల్కు ఫోన్ చేసి విషయం చెప్పింది. కాన్పు సమయంలో తన వెంట ఉండాలని కోరింది. దీంతో అనిల్ వ్యవసాయ పనులన్నీ ముగించుకుని శుక్రవారం రాత్రి మాట్లొద్దికి ద్విచక్రవాహనంపై బయల్దేరాడు. ఎన్హెచ్–44పై వెళ్తుండగా గౌలిగూడ సమీపంలోకి రాగానే అర్ధరాత్రి సమయంలో ద్విచక్రవాహనం అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో అనిల్ తలకు తీవ్రమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు
హెల్మెట్ లేకపోవడంతో..
ప్రమాద సమాచారం అందుకున్న నేరడిగొండ ఎస్సై ఇమ్రాన్ ఘటన స్థలాన్ని పరిశీంచారు. వివరాలు తెలుసుకుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని ఆదిలాబాద్లోని రిమ్స్కు తరలించారు. అనిల్ హెల్మెట్ ధరించి ఉంటే ఘోరం జరిగేది కాదని పేర్కొన్నా రు. తలకు గాయం కావడంతోనే మృతిచెందిన ట్లు అంచనాకు వచ్చారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఒక్కగానొక్క కొడుకు..
అనిల్ తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కొడుకు తండ్రి మాంగ్య 17 ఏళ్ల క్రితం మరణించాడు. తల్లి అన్నీ తానై పిల్లలను పెంచి పెద్ద చేసింది. అనిల్ మరణ వార్త తెలియడంతో రిమ్స్కు చేరుకున్న తల్లి, చెల్లి విగతజీవిగా ఉన్న కొడుకును చూసి బిడ్డను చూడకుండానే వెళ్లిపోయావా కొడుకా అంటూ గుండెలు పగిలేలా రోదించారు. ఒకవైపు కొత్త ప్రాణం రాబోతున్న సంతోషంం మరోవైపు ఆ ఆనందాన్ని చూడకుండానే వెళ్లిపోయిన తండ్రి జ్ఞాపకం ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. అనిల్ మృతదేహాన్ని శనివారం స్వగ్రామానికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు.


