ఎన్నికల విధులు పారదర్శకంగా నిర్వహించాలి
భైంసాటౌన్: మున్సిపల్ ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని, పారదర్శకంగా పనిచేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాన్ని మంగళవారం తనిఖీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. పోలింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించాలని, రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు పాటించాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జనరల్ అబ్జర్వర్ వీరారెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల ప్రక్రియలో పోలింగ్ నిర్వహణ కీలకమని, ఓటర్లు శాంతియుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేలా సహకరించాలని కోరారు. పోలింగ్ ముగిసిన తర్వాత సీల్ చేసిన బ్యాలెట్ బాక్సులను నిబంధనల మేరకు రిసెప్షన్ కౌంటర్లలో అప్పగించాలని సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్ సూచించారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద పకడ్బందీ పటిష్ట భద్రతా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అనంతరం రూట్ల వారీగా పోలింగ్ కేంద్రాలకు వెళ్తున్న అధికారులకు, సిబ్బందికి కలెక్టర్ సూచనలు చేశారు.


