
వనజీవి సేవలు వెలకట్టలేనివి
నిర్మల్ఖిల్లా/నిర్మల్టౌన్: ప్రకృతి ప్రేమికుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య ప్రకృతి పరిరక్షణ కోసం చేసిన సేవలు వెలకట్టలేనివని కేవా(కుమ్మర ఉద్యోగులు సంక్షేమ సంఘం) ప్రతినిధులు పేర్కొన్నారు. స్థానిక ఎస్టీయూ భవన్లో శనివారం ఏర్పాటు చేసిన సంస్మరణ సభలో రామయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేవా జిల్లా అధ్యక్షుడు తోడిశెట్టి పరమేశ్వర్ మాట్లాడుతూ.. కుమ్మర కుల బంధువు వనజీవి రామయ్య మరణం యావత్ ప్రజానీకానికి తీరనిలోటని పేర్కొన్నారు. మూడు కోట్ల మొక్కలను నాటి ప్రపంచానికి హరిత సందేశాన్నిచ్చారని గుర్తుచేశారు. రామయ్య జయంతి రోజులు ప్రభుత్వం అధికారికంగా హరిత దినోత్సవంగా నిర్వహించాలని విజ్ఞప్తిచేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పోతుగంటి సాయన్న, జిల్లా నాయకులు మారుపాక శ్రీనివాస్, మధు సిలారి, తోడిశెట్టి శంకర్, తోడిశెట్టి రవికాంత్, తాళ్లపల్లి నారాయణ, తోడిశెట్టి శ్యాంసుందర్, కానుగుల ముత్యం, శనిగారపు నారాయణ, పోతుగంటి వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.