
విలేజ్లోనే విత్తనోత్పత్తి
● దశలవారీగా రైతులందరికీ సరఫరా ● ప్రణాళికలు సిద్ధం చేస్తున్న సర్కారు ● హర్షం వ్యక్తంజేస్తున్న అన్నదాతలు
లక్ష్మణచాంద: ఈసారి రాష్ట్ర ప్రభుత్వం రైతులకు నాణ్యమైన విత్తనాలు సరఫరా చేసేందుకు నిర్ణయించింది. ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు రా ష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ప్రకటించడంతో రైతులు హర్షం వ్యక్తంజేస్తున్నారు. ఐదేళ్లుగా ప్రభుత్వం విత్తనాలు పంపిణీ చేయకపోవడంతో రైతులు వివిధ కంపెనీల హైబ్రిడ్ విత్తనాలు కొనుగోలు చేశారు. ఈ కారణంగా విత్తనాల్లో నాణ్యత లోపించి, దిగుబడులు తగ్గి నష్టపోయారు. దీంతో అన్నదాతలకు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పర్యవేక్షణలో విత్తనాలు ఉత్పత్తి చేసి, నాణ్యత పరీక్షించాకే రైతులకు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
గ్రామానికి 3–5 రైతులకు..
ఒక్కో గ్రామానికి చెందిన ఆదర్శంగా పంటలు సా గు చేస్తున్న 3–5 రైతులను ఎంపిక చేసి వారికి విత్తనాలు పంపిణీ చేయనున్నారు. వీరు పండించిన వి త్తనాలను రెండో పంట కోసం ఇతర రైతులకు అందజేస్తారు. ఇలా మూడేళ్లలో గ్రామంలోని రైతులందరికీ అతి తక్కువ ధరకే మేలైన విత్తనాలు అందుబాటులోకి తేనున్నారు. రైతులను నకిలీ విత్తనాల బారి నుంచి కాపాడటంతో పాటు నాణ్యమైన విత్తనాలు అందించడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. త ద్వారా రైతులు అధిక దిగుబడులు సాధించే అవకా శముంది. వ్యవసాయ విశ్వవిద్యాలయం అనేక రకా ల నూతన వంగడాలను అభివృద్ధి చేసినా అందులో నుంచి మరింత మేలైన విత్తనాలు మాత్రమే అందించాలని సర్కారు ప్రణాళికలు తయారు చేస్తోంది.
1.45లక్షల ఎకరాల్లో సాగు
వానాకాలంలో జిల్లాలో 1.45 లక్షల ఎకరాల్లో వరి, పప్పు సంబంధిత పంటలు సాగవుతున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. ప్రధానంగా వరి 1.35లక్షల ఎకరాలు, కంది 8,500 ఎకరాలు, పెసలు 850 ఎకరాలు, మినుములు 650 ఎకరాలు, పప్పు ధాన్యాలు 10 వేల ఎకరాల్లో సాగవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.