సాక్షి, ముంబై: మహారాష్ట్రలో దారుణం జరిగింది. పాల్టర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగిపై ఒక వ్యక్తి అత్యంత పాశవికంగా దాడి జరిపాడు. ఆమెపై ఎనిమిది సార్లు కొడవలితో దాడి చేశాడు. దీంతో తీవ్రగాయాలైన మహిళా ఉద్యోగిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. నిన్న( శుక్రవారం) సాయంత్రం పాల్ఘర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని రెవెన్యూ విభాగంలో విధులు నిర్వహిస్తున్నస్నేహల్ సావంత్ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంది. ఈ సందర్భంలో నిందితుడు హఠాత్తుగా వెనుక నుండి వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి కొడవలితో ఒక్కసారిగా దాడి చేశాడు. ఆ మహిళ మెడ, వీపు, భుజాలు , నడుము భాగాలపై దాదాపు ఎనిమిది సార్లు కొడవలితో విచక్షణారహితంగా నరికాడు. దీనితో ఆమెకు తీవ్ర రక్తస్రావమై కుప్పకూలిపోయింది.
అయితే ఆమె స్పృహ కోల్పోయిన తర్వాత సైతం ఏ మాత్రం కనికరం లేకుండా పలుమార్లు దాడి చేశాడు. ఈ ఘటన వివరాలు అక్కడ సమీపంలో ఉన్న సీసీటీటీ కెమెరాలో రికార్డయ్యాయి. దాడి చేసిన అనంతరం, నిందితుడు తన బ్యాగ్ను, దాడికి ఉపయోగించిన కొడవలిని అక్కడే వదిలేసి పరారయ్యాడు.
అయితే తీవ్ర రక్తస్రావంతో అక్కడే పడి ఉన్న మహిళను స్థానికులు గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. స్నేహల్ను మొదట పాల్ఘర్లోని ఒక రూరల్ హాస్పిటల్కు తరలించగా ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో, మెరుగైన చికిత్స కోసం మరో ఆసుపత్రికి రిఫర్ చేశారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఈ వివరాలు తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ దాడికి గల అసలు కారణాలు ఇంకా స్పష్టంగా తెలియలేదని, కేసు నమోదు చేసి అన్ని కోణాల్లోనూ దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు ముమ్మరం చేశారు.
ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితుడిని అమోల్ ములేగా గుర్తించారు. అతను ఒక కోర్టు ప్యూన్గా పనిచేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం అతను పరారీలో ఉండటంతో, పోలీసులు అతడిని పట్టుకోవడానికి గాలింపు చర్యలు చేపట్టారు.


