
అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లాల్సిన విమానం జూన్ 12వ తేదీ సెకన్ల వ్యవధిలోనే కుప్పకూలిపోయి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కూలి.. పేలిపోయింది. ఘటనలో విమానంలో ప్రయాణికులు, సిబ్బందితో పాటు జనావాసాలపై కూలి మరో 24 మంది మొత్తం 265 మంది మరణించారు.
ఇంత పెద్ద ప్రమాదంలో విమానం నుంచి ఒకే ఒక్కడు బయటపడ్డాడు. 11A సీటులో కూర్చున్న రమేశ్ విశ్వాస్ కుమార్ (38) అనే ప్రయాణికుడు గాయాలతో బయటపడి ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. అయితే బ్రతికానన్న ఆనందం అతనికి ఒకవైపు ఉండగా.. తన వెంట వచ్చిన సోదరుడు దుర్మరణం చెందాడన్న దుఃఖం మరొకవైపు కలచివేస్తోంది. రమేశ్ విశ్వాస్ కుమార్తో పాటు అతని సోదరుడు కూడా లండన్ బయల్దేరాడు. కానీ రమేశ్ విశ్వాస్ మాత్రమే ప్రాణాలతో బయటపడగా, సోదరుడు మాత్రం చనిపోయిన 241 మందిలో ఒకడయ్యాడు. ఇది రమేశ్ను అతని కుటుంబాన్ని తీవ్రంగా వేధిస్తోంది.
విమానం కూలి ప్రాణాలతో బయటపడ్డ తర్వాత రమేశ్ తన తండ్రికి ఫోన్ చేసిన విషయాన్ని రమేశ్ మరో సోదరుడు నయన్ కుమార్ రమేశ్ స్కై న్యూస్క వెల్లడించాడు. ‘ మా నాన్నకు రమేశ్ విశ్వాస్ ఫోన్ చేశాడు. విమానం కూలిపోయిందన్నాడు. నేనొక్కడినే బయటపడ్డా. మిగతా ఎవరూ నాకు అక్కడ కనిపించలేదు. తమ్ముడు ఎక్కడ అనే విషయం కూడా తెలీదు. అసలు విమానం ఎలా కూలిపోయిందో నాకైతే అర్థం కాలేదు’ అని చెప్పినట్లు నయన్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం రమేశ్ ప్రాణాలతో బ్రతికాడన్న సంతోషం ఒకవైపు, ఉన్న మరొక సోదరుడ్ని కోల్పోవడం మాత్రం తీవ్ర వేదనకు గురిచేస్తుందన్నాడు.