చెన్నై: తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై విషయం గత కొద్ది రోజులుగా హాట్ టాఫిక్గా మారింది. ఆయన పార్టీని వీడుతున్నారని త్వరలోనే ఒక కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందని పుకార్లు చెలరేగాయి. ఈ నేపథ్యంలో ఈ అంశంపై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ స్పందించారు. అన్నామలై బీజేపీకి రాజీనామా చేస్తున్నారనేది పూర్తిగా అవాస్తవాలని ఆయన రాజీనామా చేయలేదని కొట్టిపేడేశారు.
నైనార్ నాగేంద్రన్ మాట్లాడుతూ.. "అన్నామలై బీజేపీని వీడుతున్నట్లు వస్తున్న వార్తలన్నీ కేవలం ఆధారాలు లేని పుకార్లు. మా ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నాకు ఆయన నుంచి ఎలాంటి రాజీనామా లేఖ అందలేదు. మా మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవు. కొత్త పార్టీ పెట్టే విషయంపై అన్నామలై ఎవరితోనూ మాట్లాడలేదు. మేము కూడా ఆయనతో ఈ విషయం మాట్లాడలేదు, ఆయన కూడా మాతో ప్రస్తావించలేదు. ఆయన రాజీనామా చేశారంటూ వస్తున్న వార్తలు అవాస్తవం, వాటిలో ఎలాంటి నిజం లేదు, అవన్నీ కేవలం వదంతులు మాత్రమే." అని నాగేంద్రన్ అన్నారు. ఈ క్రమంలోనే అన్నామలైకు పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలిపారు.
ఇటీవలే న్యూఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో అన్నామలై భేటీ అయ్యారు. తదుపరి రాజీనామా చేయడానికి గల కారణాలను వివరిస్తూ ఐదు పేజీల లేఖను ఆయనకు సమర్పించారు. అయితే ఆయన రాజీనామాను బీజేపీ ఇంతవరకూ ఆమోదింపలేదు. ఈ నేపథ్యంలోనే తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు ఈ విధంగా వ్యాఖ్యానించారు.
కాగా ఇటీవల జరిగిన ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అన్నామలైను పూర్తిగా సైడ్ట్రాక్ చేసింది. ఆయన అభిప్రాయాలకు ఏమాత్రం గౌరవం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీ వీడడానికి నిర్ణయం తీసుకున్నారు. దీంతో బీజేపీ అన్నామలైని శాంతిపజేసే యత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.


