
ఎన్ఈపీకి వ్యతిరేకంగా తీసుకొచ్చిన తమిళనాడు ప్రభుత్వం
చెన్నై: జాతీయ విద్యా విధానా(ఎన్ఈపీ)నికి ప్రత్యామ్నాయంగా తమిళనాడు రాష్ట్ర విద్యా విధానా(ఎస్ఈపీ)న్ని తీసుకొచ్చింది. దీనిని సీఎం స్టాలిన్ శుక్రవారం ఆవిష్కరించారు. కొత్తూరుపురంలోని అన్నా సెంటెనరీ లైబ్రరీ ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరిగింది. జాతీయ విద్యా విధానాన్ని తమిళనాడు ప్రభుత్వం ఆది నుంచి వ్యతిరేకిస్తోంది. అందుకు గాను కేంద్రం సమగ్ర శిక్ష నిధులను రాష్ట్రానికి నిలిపేసింది. అయినా.. రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. ఈ ఉద్రిక్తతల సమయంలోనే రాష్ట్ర విద్యా విధానాన్ని విడుదల చేసింది.
కొత్త విధానాన్ని రూపొందించడానికి 2022లో రిటైర్డ్ జస్టిస్ మురుగేశన్ నేతృత్వంలో 14 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ ప్యానెల్ గతేడాది జూలైలో సీఎం స్టాలిన్కు తన సిఫార్సులను సమర్పించింది. వాటిని ప్రభుత్వం శుక్రవారం ఆవిష్కరించింది. ఎస్ఈపీ ప్రకారం.. ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు బదులుగా 11, 12వ తరగతుల్లోని ఏకీకృత మార్కుల ఆధారంగా డిగ్రీ ఆర్ట్స్, సైన్స్ కోర్సుల ప్రవేశం కల్పిస్తారు. 3,5, 8 తరగతుల్లో పబ్లిక్ పరీక్షల విధానాన్ని కూడా ఎస్ఈపీ వ్యతిరేకించింది.
ఇది సామాజిక న్యాయానికి వ్యతిరేకమని, దీనివల్ల డ్రాపౌట్లు పెరుగుతాయని, విద్యను వ్యాపారీకరించడమేనని తెలిపింది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని సంస్థలకు గణనీయమైన పెట్టుబడులతో పాటు.. కృత్రిమ మేధ, ఆంగ్ల భాషలకు పెద్ద ఎత్తున ప్రోతాహాన్ని అందించాలని కమిటీ ప్రతిపాదించింది. అంతేకాదు.. విద్యను ఉమ్మడి జాబితా నుంచి రాష్ట్ర జాబితాలోకి తిరిగి తీసుకు రావాలని కమిటీ సిఫార్సు చేసింది. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, రాష్ట్ర బోర్డుతో సహా అన్ని బోర్డుల్లో విద్యార్థులు తమిళం చదువుతారని విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేష్ తెలిపారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వ విధానాన్ని తెలంగాణ మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్నాయకురాలు తమిళిసై సౌందరరాజన్ విమర్శించారు. ఇది రాష్ట్ర అహంకార విధానంగా అభివర్ణించారు.