
అహ్మదాబాద్: ప్రమాదానికి గురైన ఎయిరిండియా విమానం బీజే మెడికల్ కాలేజీ ప్రాంగణంలో ఓ టీ స్టాల్ వెనక కూలింది. ఆ టీ కొట్టు నడిపే సీతాబెన్ అనే మహిళ ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకుంది. కాలిన గాయాలతో బతికి బయటపడింది. చెట్టుకింద టీస్టాల్లో నిద్రపోతున్న 14 ఏళ్ల కుమారుడు ఆకాశ్ మాత్రం మంటలకు బలయ్యాడు.
తన వెనకగా చెలరేగుతున్న మంటల నుంచి సీతాబెన్ తప్పించుకుని పరుగెత్తుకుంటూ వస్తున్న వీడియో వైరల్గా మారింది. ఐసీయూలో కోలుకుంటున్న ఆమె మీడియాతో మాట్లాడింది. ‘‘నేను విమానాన్ని చూడలేదు. కానీ భారీ శబ్దం విన్పించింది. వెంటనే మంటలు, పొగ కమ్ము కుంటుండటంతో ఏమీ కన్పించకుండా పోయింది. భయపడి పరుగులు తీశాను’’ అంటూ గుర్తు చేసుకుంది.
నా భార్యకింకా తెలియదు
సీతాబెన్ భర్త సురేశ్కుమార్ కూడా ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ‘‘ప్రమాద సమ యంలో నేను ఇంట్లో ఉన్నా. టీ స్టాల్లో ఉన్న నా భార్యకు ఆకాశ్ లంచ్ బాక్స్ తీసుకెళ్లాడు. తర్వాత అక్కడే పడుకుని ప్రమాదానికి బలైపో యాడు’’ అంటూ కన్నీటిపర్యంతమయ్యాడు. ‘‘ఈ ఘోరం గురించి నా భార్యకు ఇంకా చెప్పలేదు. నా కొడుకు మృతదేహం గుర్తించలేనంతగా కాలిపోయింది. దాంతో పరీక్షల నిమిత్తం నా డీఎన్ఏ నమూనా ఇచ్చా’’ అంటూ గుండెలవిసేలా రోదించాడు.