పప్పు చెడిపోయిందని క్యాంటిన్‌ కాంట్రాక్టర్‌పై దాడి | Shiv Sena MLA Gaikwad Thrashes Canteen Contractor | Sakshi
Sakshi News home page

పప్పు చెడిపోయిందని క్యాంటిన్‌ కాంట్రాక్టర్‌పై దాడి

Jul 9 2025 11:49 AM | Updated on Jul 10 2025 6:00 AM

Shiv Sena MLA Gaikwad Thrashes Canteen Contractor


మహారాష్ట్ర ఎమ్మెల్యే సంజయ్‌ గైక్వాడ్‌ నిర్వాకం 

ముంబై: పాడైపోయిన భోజనం పెట్టారన్న కారణంతో క్యాంటిన్‌ కాంట్రాక్టర్‌పై అధికార కూటమి ఎమ్మెల్యే దాడి చేయడం వివాదాస్పదంగా మారింది. మహారాష్ట్రలో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. శివసేన(షిండే) ఎమ్మెల్యే సంజయ్‌ గైక్వాడ్‌ ముంబైలోని ఎమ్మెల్యేల హాస్టల్‌ క్యాంటిన్‌లో రాత్రి భోజనం కోసం వచ్చారు. ఆయనకు వడ్డించిన పప్పు చెడిపోయినట్లు గుర్తించారు. 

దాంతో ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే క్యాంటిన్‌ కాంట్రాక్టర్‌ను పిలిపించారు. పప్పు వాసన చూడాలంటూ కాంట్రాక్టర్‌ను ఒత్తిడి చేశారు. ఇది ఎలా తినాలంటూ మండిపడ్డారు. సహనం కోల్పోయి కాంట్రాక్టర్‌ చెంప చెల్లుమనిపించారు. ముఖంపై గట్టిగా కొట్టారు. దెబ్బల తీవ్రతకు కాంట్రాక్టర్‌ ఒక్కసారిగా కింద పడిపోయారు. పైకి లేచేందుకు ప్రయత్నించగా ఎమ్మెల్యే మళ్లీ మళ్లీ దాడి చేశారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.  

శివసేన స్టైల్‌ ఇదే 
ఎమ్మెల్యే సంజయ్‌ గైక్వాడ్‌ అనుచిత ప్రవర్తన పట్ల మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రతిపక్షాలు సైతం మండిపడ్డాయి. ఇలాంటి ఘటనలు ఎమ్మెల్యేల ప్రతిష్టను దెబ్బతీస్తాయని ఫడ్నవీస్‌ అన్నారు. హింసను తాను సమర్థించబోనని ఏక్‌నాథ్‌ షిండే చెప్పారు. ఏదైనా సమస్య ఉంటే చట్టపరంగా ముందుకెళ్లాలని సూచించారు. 

ఇతరులను అకారణంగా కొట్టడం సరైంది కాదన్నారు. మరోవైపు తన వ్యవహార శైలిని ఎమ్మెల్యే సంజయ్‌ గైక్వాడ్‌ సమర్థించుకున్నారు. శివసేన స్టైల్‌ ఇదేనని తేల్చిచెప్పారు. క్యాంటిన్‌లో ఆహారం నాణ్యంగా లేదని చాలాసార్లు ఫిర్యాదు చేశానని, ఎవరూ పట్టించుకోలేదని విమర్శించారు. తన ఫిర్యాదును లెక్కచేయనప్పుడు ఇంకేం చేయాలి? చచ్చిపోవాలా? అని ప్రశ్నించారు. కాంట్రాక్టర్‌ను కొట్టడం పట్ల తానేమీ విచారించడం లేదన్నారు. సంజయ్‌ గైక్వాడ్‌ వివాదాస్పద ఎమ్మెల్యేగా పేరుగాంచారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement