పథనంతిట్ట (కేరళ) : తండ్రి ప్రేమ, దైవభక్తి స్వచ్ఛమైన, మేలిమి బంగారంలా మేళవించే 'తిరువాభరణాలు' (స్వామివారి పవిత్ర ఆభరణాలు) తీసుకువెళ్లే వార్షిక ఉత్సవ యాత్ర ఆదివారం పథనంథిట్టలోని పందలంలో ఒక ఆలయంలో నుంచి శబరిమలకు బయలుదేరింది. ఆ పవిత్ర ఆభరణాలను ఈ నెల 14న, ‘మకరవిళక్కు’ ఉత్సవం రోజు స్వామి అయ్యప్పకు అలంకరించనున్నారు. ట్రావన్కూర్ దేవస్వమ్ బోర్డ్ (టీడీబీ) ప్రతినిధులతో పాటు అనేక మంది అయ్యప్ప భక్తులు కూడా ‘తిరువాభరణం ఘోషాయాత్ర’ వెంట శబరిమల ఆలయానికి సాగారు.
దశాబ్దాలుగా పాటిస్తున్న సంప్రదాయం ప్రకారం, పందలంలోని శ్రంబిక్కల్ ప్యాలెస్లోని ఖజానా నుంచి పక్కన ఉన్న వలియకోయిక్కల్ సంస్థ ఆలయానికి ఉదయం భక్తుల దర్శనార్థం తిరువాభరణాన్ని తరలించారు. టీడీబీ అధికారులు ప్యాలెస్ అధికారుల నుంచి ఆభరణాలు స్వీకరించి సంస్థ ఆలయానికి తీసుకువెళ్లారు.
వాటిని తిలకించి, పూజలు చేసేందుకు అనేక మంది భక్తులు అక్కడికి చేరారు. ‘స్వామియే శరణం అయ్యప్ప’ అనే శరణు ఘోషల మధ్య సాంప్రదాయక తంతు, పూజలు నిర్వహించిన తదుపరి పవిత్ర ఆభరణాలను చెక్క పేటికలలో పెట్టి శబరిమలకు తీసుకువెళ్లారు. ఇది జీవింతంలో ఒక్కసారైన చూడవల్సిన పవిత్రమైన ఆధ్యాత్మిక క్షణాలు.
తిరువాభరణాలు పవిత్ర యాత్ర అంటే:
అయ్యప్ప స్వామికి సంబంధించిన పవిత్రమైన ఆభరణాలను పందళం రాజకుటుంబం నుంచి మకరజ్యోతి సమయంలో శబరిమలకు ఊరేగింపుగా తీసుకెళ్లే ఒక ముఖ్యమైన, సంప్రదాయబద్ధమైన యాత్ర. ఈ యాత్రలో, ఆభరణాలను పందళంలోని వలియాకోయిక్కల్ ధర్మశాస్తా ఆలయం నుంచి గురుస్వామి తలపై పెట్టుకుని ఊరేగింపుగా, కాలినడకన 83 కిలోమీటర్ల దూరం శబరిమల సన్నిధానానికి తీసుకెళ్తారు, ఇది అయ్యప్ప భక్తులకు అత్యంత పవిత్రమైన ఘట్టం
(చదవండి: జనవరి 12న తిరువాభరణం ఆభరణాల ఊరేగింపు)


