గయాజీ: బాత్రూమ్ పైపులు, ఫిట్టింగ్లను మరమ్మతులు చేసే ఒక సాధారణ ప్లంబర్కు చెందిన బ్యాంక్ ఖాతాలోకి ఏకంగా 294 కోట్ల రూపాయలు వచ్చిపడ్డాయి. దీంతో హుతాశుడైన ఆ వ్యక్తి భయపడిపోయి స్థానిక నేతలకు సమాచారమిచ్చారు. అసలే సైబర్ నేరగాళ్లు తాము కాజేసిన సొత్తును ఎవరికీ తెలీకుండా ఇంకొకరి ఖాతాలోకి మళ్లిస్తున్న ఉదంతాలు వెలుగుచూస్తున్న నేపథ్యంలో వెంటనే బ్యాంక్ అధికారులకు లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని స్థానిక నేతలు సూచించడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదుచేశాడు. బిహార్లోని గయాజీ జిల్లాలోని మస్త్పురా గ్రామంలో ఈ ఘటన జరిగింది. బ్యాంక్ ఖాతాదారు వికాశ్ కుమార్ ఈ వివరాలను వెల్లడించారు.
‘‘నా బ్యాంక్ ఖాతాలో కేవలం 113 రూపాయలే ఉన్నాయి. గురువారం ఉదయం నీళ్ల పైపులు ఫిట్టింగ్, రిపేర్ చేసినందుకు ఒక కస్టమర్ ఇచ్చిన డబ్బు బ్యాంక్ ఖాతాలో పడటంతో ఆ రూ.1,300 మాత్రమే విత్డ్రా చేశా. అప్పుడు ఖాతాలో ఏకంగా రూ.94 కోట్లు ఉన్నాయి. అది కాస్తా సాయంత్రానికి రూ.294 కోట్లకు పెరిగింది. ఇంతటి నగదు ఎక్కడి నుంచి వచ్చిపడుతుందో తెలీక నాయకులకు సమాచారం ఇచ్చా. వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేయమన్నారు’’అని తెలిపారు. దీనిపై బోద్గయ పోలీస్స్టేషన్ హౌస్ఆఫీసర్ మనోజ్ కుమార్ సింగ్ మాట్లాడారు. ‘‘ఇది పొరపాటున జరిగిందా? ఏదైనా సాంకేతిక తప్పిదమా లేదా సైబర్ నేరస్తులు దాచుకున్న డబ్బా? అనేది తేలుస్తాం’’అని ఆయన చెప్పారు.


