
పురులియా: పశ్చిమబెంగాల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం లారీని బొలెరో వాహనం ఢీకొనడంతో 9 మంది మృతి చెందారు. వివాహానికి హాజరై తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పురులియా జిల్లాలోని బలరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నామ్షోల్ సమీపంలోని జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.
పోలీసులు వివరాలు ప్రకారం.. అడబానా గ్రామం నుంచి జార్ఖండ్లోని నిమ్దిహ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని తిలైటాండ్కు వెళ్తుండగా, బొలెరో వాహనం అతివేగంగా ట్రక్కును ఢీకొట్టింది. ఘటనలో బొలెరో వాహనం నుజ్జునుజ్జు అయింది. స్థానికులు వెంటనే ప్రమాద స్థలానికి చేరుకుని గాయపడిన వారిని సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.
అయితే, తొమ్మిది మంది ప్రయాణికులు అక్కడికి చేరుకునేలోపే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. బాధితుల స్వగ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులందరూ ఆనందంగా వివాహ వేడుకకు హాజరై తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకోవడం విషాదంలో ముంచెత్తింది.