
1964.. మే 27.. భారతదేశం తన తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ(Pandit Jawaharlal Nehru)ను కోల్పోయింది. నాడు ఆయన ఆకస్మిక మరణం యావత్ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయనకున్న ప్రజాదరణ ఎంతటిదంటే.. ఆయన మరణ వార్త ప్రపంచవ్యాప్తంగా పలు వార్తాపత్రికలలో ప్రముఖంగా వచ్చింది. నాడు భారత ప్రధాని నెహ్రూ మరణ వార్తను న్యూయార్క్ టైమ్స్ తన మొదటి పేజీలో రెండవ ప్రధాన వార్తగా ముద్రించింది.
భారత తొలి ప్రధాని జవహర్లాల్ మరణించిన సమయానికి దేశానికి స్వాతంత్యం సిద్ధించి, కొన్నేళ్లే అయ్యింది. దీనికి తోడు 1962లో చైనాతో జరిగిన యుద్ధంలో భారతదేశం ఓటమి పాలయ్యింది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే జవహర్లాల్ నెహ్రూ ఈ లోకాన్ని వీడటం యావత్ దేశాన్ని ఆవేదనలోకి నెట్టివేసింది. చైనా(China) చేతిలో భారత్ ఓటమి దరిమిలా ప్రధాని నెహ్రూ ఆరోగ్యం క్షీణించడం ప్రారంభమైందని చెబుతారు. ఈ యుద్ధంలో భారతదేశం ఓటమిని నెహ్రూ తట్టుకోలేకపోయారని అంటారు.
1962, నవంబర్ 20న అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ.. చైనా నుంచి తమ సైనిక ఓటమిని అంగీకరించారు. వాలాంగ్, సిల్లా, బోమ్డిలా ప్రాంతాలలో భారత సైన్యం ఓడిపోయిందని ఆయన ప్రకటించారు. ఇదేవిధంగా ఆయన పార్లమెంటులోనూ చైనాతో జరిగిన యుద్ధంలో భారత్ ఓడిపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సందర్భంలో అప్పటి భారత రాష్ట్రపతి ఎస్. రాధాకృష్ణన్(President S. Radhakrishnan) కూడా సొంత ప్రభుత్వంపైనే తీవ్రమైన ఆరోపణలు చేశారు. భారత ప్రభుత్వం చైనాను తేలికగా నమ్ముతోందని, వాస్తవాలను విస్మరిస్తున్నదని ఆయన విమర్శించారు. ఈ ప్రశ్నలు ప్రధాని నెహ్రూను అమితంగా బాధించాయని చెబుతారు.
ఈ విమర్శల దరిమిలా నాటి ప్రధాని నెహ్రూ అప్పటి యుద్ధంలో భారత ఓటమికి చైనా చేసిన ద్రోహమే కారణమని భావించారు. ఆ తరువాత అనారోగ్యానికి గురయ్యారు. ఈ సమయంలో ఆయన ఒక ఏడాదిపాటు కశ్మీర్లో గడిపారు. 1964 మే నెలలో నెహ్రూ ఢిల్లీకి తిరిగి వచ్చారు. మే 27న ఉదయం బాత్రూమ్ నుండి తన గదిలోనికి వస్తూ, స్పృహ కోల్పోయి, అపస్మారక స్థితికి చేరుకున్నారు. వెంటనే అక్కడి సిబ్బంది వైద్యులను పిలిపించారు. అదేరోజు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో భారతదేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గుండెపోటుతో మరణించారని వైద్యులు ప్రకటించారు.
ప్రముఖ రాజకీయ నేత ములాయం సింగ్ యాదవ్ ఒకప్పుడు దేశ రక్షణ మంత్రిగా కూడా ఉన్నారు. నెహ్రూ శకాన్ని చూసిన కొద్దిమంది నేతలలో ఆయన ఒకరు. ఒక సభలో ఆయన మాట్లాడుతూ ‘పండిట్ నెహ్రూకు ఎటువంటి వ్యాధి లేదు. 1962లో చైనా.. భారతదేశంపై దాడి చేసింది. ఆయుధాల కొరత ఉన్నప్పటికీ మన సైన్యం ధైర్యాన్ని ప్రదర్శించింది. అయినప్పటికీ భారత్.. చైనా ముందు నిలువలేకపోయింది. దీంతో నెహ్రూ తీవ్రంగా కలత చెందారు. ఈ ఆవేదనతోనే నెహ్రూ మృతి చెందారు’ అని అన్నారు.
జవహర్లాల్ నెహ్రూ భద్రతా అధికారిగా పనిచేసిన కె.ఎం. రుస్తమ్జీ ‘ఐ వజ్ నెహ్రూ షాడో’ అనే పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకంలో తాను నెహ్రూ భద్రతా బాధ్యతలను స్వీకరించినప్పుడు, ఆయన వయస్సు 63 ఏళ్లని రాశారు. అయినా ఆయన 33 ఏళ్ల వ్యక్తిలా కనిపించేవారని పేర్కొన్నారు. నెహ్రూ ఎప్పుడూ లిఫ్ట్ ఉపయోగించలేదని, ఉత్సాహంగా మెట్లు ఎక్కేవారని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: ‘జగన్నాథ్’ పేరుపై హక్కులెవరివి?