రామ మందిరం సీఈవో రేసులో మాజీ ఐపీఎస్.. గతం తొవ్వితే షాకులే.. | Ram Mandir Row 5 things about Ex IPS Officer Amitabh Thakur | Sakshi
Sakshi News home page

రామ మందిరం సీఈవో రేసులో మాజీ ఐపీఎస్.. గతం తొవ్వితే షాకులే..

Jul 15 2026 4:36 PM | Updated on Jul 15 2026 4:50 PM

Ram Mandir Row 5 things about Ex IPS Officer Amitabh Thakur

అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టులో ప్రధాన కార్యనిర్వాహక అధికారి (సీఈవో) పదవి భర్తీ ప్రక్రియ మొదలైన వెంటనే తొలి దరఖాస్తు ఉత్తరప్రదేశ్ కేడర్‌కు చెందిన మాజీ ఐపీఎస్ అధికారి అమితాబ్ ఠాకూర్ నుంచి వచ్చింది. ట్రస్ట్ ఇటీవల ఈ పదవికి భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించిన విషయం తెలిసిందే. దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ జులై 18.

 దరఖాస్తు పంపిన తర్వాత అమితాబ్ ఠాకూర్ మాట్లాడుతూ.. ట్రస్ట్ ప్రతిపాదించిన అర్హతలు, అనుభవం, పరిపాలనా సామర్థ్యం అన్నింటికీ తాను సరిపోతానని చెప్పారు. పోలీసు, పరిపాలనా సేవల్లో ఎన్నో సంవత్సరాల అనుభవం ఈ బాధ్యతలు నిర్వహించడంలో ఉపయోగపడుతుందని తెలిపారు. దరఖాస్తు సమర్పించిన తర్వాత మరోసారి అమితాబ్ ఠాకూర్ వార్తల్లో నిలిచారు.

ఆయన జీవితానికి సంబంధించిన ఎప్పుడూ చర్చకు వచ్చిన 5 ప్రధాన సంఘటనలు ఇవి..

వివాదం-1: వికాస్ దుబే ఎన్‌కౌంటర్‌కు ముందు చేసిన అంచనా
కాన్పూర్ బిక్రూ గ్రామంలో 2020లో ఎనిమిది మంది పోలీసులను హత్య చేసిన తర్వాత గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబే మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో లొంగిపోయాడు. ఆ వెంటనే అమితాబ్ ఠాకూర్ సామాజిక మాధ్యమాల్లో ఒక పోస్టు పెట్టారు. వికాస్ దుబే పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో చనిపోయే అవకాశం ఉందని, అక్కడితో వ్యవహారం ముగిసే అవకాశముందని పేర్కొన్నారు.

వికాస్ దుబేపై కన్నా పోలీసు వ్యవస్థలో ఉన్న లోపాలు, అవినీతిపై నిష్పాక్షిక విచారణ జరగడం ముఖ్యమని కూడా చెప్పారు. తర్వాత వికాస్ దుబే పోలీసు ఎన్‌కౌంటర్‌లో మరణించడంతో ఆయన పోస్టు విస్తృత చర్చకు దారితీసింది.

వివాదం-2: ములాయం సింగ్ యాదవ్ ఫోన్ కాల్ ఆడియో  
అమితాబ్ ఠాకూర్ 2015లో ఓ ఆరోపణ చేశారు. అప్పటి సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ తనకు ఫోన్ చేసి బెదిరించారని, "మారిపోవాలి" అని హెచ్చరించారని చెప్పారు. ఆ సంభాషణ రికార్డింగ్‌ను బహిర్గతం చేశారు. దీనితో పెద్ద రాజకీయ వివాదం చెలరేగింది. ఆ తర్వాత ఈ ఘటనపై హజ్రత్‌గంజ్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ములాయం సింగ్ యాదవ్ ఫోన్ చేసిన విషయం అంగీకరించినా, బెదిరించిన ఆరోపణలను ఖండించారు. ఈ వివాదం తర్వాత అమితాబ్ ఠాకూర్‌పై అత్యాచార ఆరోపణలు వచ్చాయి. ఆయన సస్పెన్షన్‌ను కూడా ఎదుర్కొన్నారు.

వివాదం-3: అప్పటి ఎస్పీ అమితాబ్ ఠాకూర్‌కు చెంపదెబ్బ
మీడియా కథనాల ప్రకారం.. ఈ ఘటన 2006లో జరిగింది. ఉత్తరప్రదేశ్ ఫిరోజాబాద్ జిల్లా జస్రానా ప్రాంతంలో జరిగిన ఒక కార్యక్రమంలో పోలీసులు, స్థానిక నాయకుల మధ్య వివాదం తలెత్తింది. ఆ సమయంలో అమితాబ్ ఠాకూర్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ)గా పని చేస్తున్నారు. నాయకుల మధ్య వివాదం ఘటనలో  అమితాబ్ ఠాకూర్‌తో అప్పటి సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే రామ్‌వీర్ సింగ్ అసభ్యంగా ప్రవర్తించి చెంపదెబ్బ కొట్టారని ఆరోపణలు వచ్చాయి.

వివాదం-4: ఫేస్‌బుక్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు
అమితాబ్ ఠాకూర్ సాహిత్యం, రచనలతో కూడా అనుబంధం కొనసాగించారు. సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉండే ఆయన.. ఒకసారి ఫేస్‌బుక్‌లో ఉన్న "ఐ హేట్ గాంధీ" పేరుతో ఉన్న పేజీని వ్యతిరేకించారు. ముందుగా ఆ పేజీ తొలగించాలని ఫేస్‌బుక్‌ను కోరారు. స్పందన రాకపోవడంతో ఫేస్‌బుక్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఆ తర్వాత ఆ పేజీ తొలగించారు. ఈ చర్యకు సామాజిక మాధ్యమాల్లో ప్రశంసలు లభించాయి.

వివాదం-5: ధోనీకి 1,000 రూపాయల చెక్కు
క్రికెట్ ప్రపంచకప్‌-2015లో ఆస్ట్రేలియాతో భారత్ ఓడిన తర్వాత అప్పటి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి అమితాబ్ ఠాకూర్ 1,000 రూపాయల చెక్కు పంపించారు. దానితో పాటు ఒక లేఖ కూడా పంపించారు. అందులో ఓటమికి వ్యంగ్యంగా ధన్యవాదాలు తెలిపారు. అంతేకాదు, "మున్నీ బద్నామ్ హుయీ", "షీలా కీ జవానీ" పాటలపై నిషేధం విధించాలని హైకోర్టును కూడా ఆశ్రయించారు.

ట్రస్ట్ ప్రధాన కార్యదర్శికి సీఈవో జవాబుదారీ
శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తెలిపిన వివరాల ప్రకారం.. నియమితులయ్యే సీఈవో నేరుగా ట్రస్ట్ ప్రధాన కార్యదర్శికి జవాబుదారీగా ఉంటారు. ఆలయానికి సంబంధించిన పరిపాలన, చట్టపరమైన వ్యవహారాలు, ఆర్థిక నిర్వహణ బాధ్యతలు ఆయన వద్ద ఉంటాయి. ప్రధాన కార్యదర్శి అప్పగించే ఇతర బాధ్యతలను కూడా నిర్వర్తించాలి.

సీఈవో పదవికి మతపరమైన అర్హత తప్పనిసరి
ఈ పదవికి ట్రస్ట్ మతపరమైన అర్హతలు కూడా నిర్ణయించింది. దరఖాస్తుదారు హిందువు, వైష్ణవుడు, శ్రీరామ భక్తుడు అయి ఉండాలి. ఆలయ నిర్వహణలో గత అనుభవం ఉంటే ఎంపిక ప్రక్రియలో ప్రాధాన్యం ఇస్తారు.

విరాళాల వివాదం తర్వాత సీఈవో పదవికి ప్రాధాన్యం
రామ మందిరం విరాళాల వివాదం వెలుగులోకి వచ్చిన తర్వాత ట్రస్ట్ పరిపాలనా వ్యవస్థను మరింత బలోపేతం చేసే పనిలో ఉంది. ఈ నేపథ్యంలో కొత్త సీఈవో నియామకానికి అధిక ప్రాధాన్యం ఏర్పడింది. కొత్త అధికారి నుంచి పరిపాలనా పారదర్శకత, ఆర్థిక పర్యవేక్షణ, భద్రతా ఏర్పాట్లు, భక్తులకు మెరుగైన నిర్వహణ అందుతుందని ఆశిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement