రఫెల్‌ రాక.. రాజ్‌నాథ్‌ సింగ్‌ కీలక వ్యాఖ్యలు

Rajnath Singh After Rafale Jets Land in India - Sakshi

న్యూఢిల్లీ: భారత వైమానిక దళం(ఐఏఎఫ్‌) దీర్ఘకాలంగా వేచిచూస్తున్న అత్యాధునిక రఫేల్‌ యుద్ధ విమానాలు బుధవారం అంబాలా వైమానికి స్ధావరానికి చేరిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దాయాది దేశం పాక్‌, డ్రాగన్‌ దేశాలకు పరోక్షంగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘పక్షులు అంబాలాలో సురక్షితంగా దిగాయి. రఫేల్ ఫైటర్‌ జెట్స్‌ రాకతో మన సైనిక చరిత్రలో కొత్త శకానికి తెర లేచింది. ఈ మల్టీరోల్ విమానాలు ఐఏఎఫ్‌ సామర్థ్యాలను విప్లవాత్మకంగా మారుస్తాయి. మనం ఈ రఫేల్ యుద్ధ విమానాలు సొంతం చేసుకోవడం చూసి ఎవరి వెన్నులోనైనా వణుకు పడుతుంది అంటే.. అది కేవలం భారత్ భూభాగాన్ని ఆక్రమించుకోవాలని కుట్ర పన్నుతున్న వారికేన’ని రాజ్‌నాథ్ సింగ్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం భారత్‌లోకి చొచ్చుకు రావాలనే కాంక్షతో రగిలిపోతోంది పాకిస్తాన్, చైనా దేశాలే. ఆ రెండు దేశాలను ఉద్దేశించే రక్షణ శాఖ మంత్రి ఈ హెచ్చరికలు చేశారని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. (‘ఏ దేశంపై దాడి చేసే ఉద్దేశం లేదు’)

రఫేల్ ఫైటర్‌ జెట్స్ కొనుగోలుపై విమర్శలు చేస్తోన్న కాంగ్రెస్ పార్టీకి సైతం రాజ్‌నాథ్ సింగ్ ట్విటర్ ద్వారా బదులిచ్చారు. రఫేల్ యుద్ధ విమానాలు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అవసరాలకు అనుగుణంగా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాతే ఫ్రాన్స్ నుంచి వాటిని కొనుగోలు చేయడం జరిగిందని.. ఇప్పటికే ఈ విషయంలో ఉన్న అన్ని సందేహాలకు సమాధానాలు ఇవ్వడం జరిగిందని రాజ్‌నాథ్ సింగ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top