మహా ఈవీఎం వివాదం | Political Row Erupts Over Mumbai North-west Seat Results, More Details Inside | Sakshi
Sakshi News home page

EVMs Controversy: మహా ఈవీఎం వివాదం

Jun 17 2024 5:08 AM | Updated on Jun 17 2024 11:50 AM

Political row erupts over Mumbai North-West seat results

ముంబై నార్త్‌వెస్ట్‌లో 48 ఓట్లతో నెగ్గిన శివసేన అభ్యర్థి 

మొబైల్‌ ఫోన్‌తో ఈవీఎంను హ్యాక్‌ చేశారనే ఆరోపణలు 

కౌంటింగ్‌ కేంద్రంలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌ ఫోన్‌ను వాడిన వాయ్‌కర్‌ బంధువు 

ఫలితాన్ని ప్రభావితం చేశారని మిడ్‌–డే పత్రిక కథనం 

ఖండించిన రిటరి్నంగ్‌ ఆఫీసర్‌ ఈవీఎంలను తెరవడానికి ఓటీపీ అక్కర్లేదు 

డేటా ఎంట్రీ ఆపరేటర్‌ లాగిన్‌ కావడానికి మాత్రమే ఓటీపీ 

ఓట్లలో ఎలాంటి మార్పులకు అవకాశం లేదు 

మిడ్‌–డేపై పరువునష్టం కేసు

18వ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన జూన్‌ 4న అందరి దృష్టిని ఆకర్షించిన లోక్‌సభ స్థానం ముంబై నార్త్‌వెస్ట్‌. ఎందుకంటే అక్కడ గెలుపొందిన శివసేన అభ్యర్థి రవీంద్ర వాయ్‌కర్‌కు వచి్చంది కేవలం 48 ఓట్ల ఆధిక్యం. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఇదే అత్యల్ప మెజారిటీ. ఇప్పుడు దానిచుట్టే రగడ మొదలైంది. 

వాయ్‌కర్‌కు అనుకూలంగా కౌంటింగ్‌  కేంద్రంలో ఉన్న ఆయన బంధువు మొబైల్‌ ఫోన్‌తో ఈవీఎంను హ్యాక్‌ చేశారనే వార్తా కథనం సంచలనం రేకెత్తిస్తోంది. ఈ కథనం క్లిప్పింగ్‌తో ఆరోపణలు మొదలయ్యాయి. అయితే ఈవీఎంలను హ్యాక్‌ చేయడానికి వీల్లేదని, వాటిని తెరవడానికి ఓటీపీ అవసరమే లేదని, బాహ్య వ్యవస్థలతో ఎలాంటి అనుసంధానం లేకుండా ఈవీఎంలు స్వతంత్రంగా పనిచేస్తాయని ముంబై నార్త్‌వెస్ట్‌ రిటర్నింగ్‌ ఆఫీసర్‌ వందనా సూర్యవంశీ చెప్పారు. అనధికారికంగా కౌంటింగ్‌ కేంద్రంలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌ ఫోన్‌ను వాడిన వాయ్‌కర్‌ బంధువుపై కేసు నమోదైందని వెల్లడించారు.  

ముంబై: ఎల్రక్టానిక్‌ ఓటింగ్‌ మెషీన్‌ (ఈవీఎం)లు బాహ్య ప్రపంచంతో ఎలాంటి అనుసంధానం, సాంకేతిక సంబంధాలు లేకుండా స్వతంత్రంగా పనిచేస్తాయని, సురక్షితమని ముంబై వాయువ్య లోక్‌సభ నియోజకవర్గం రిటరి్నంగ్‌ అధికారి వందనా సూర్యవంశీ ఆదివారం తెలిపారు. సమాచార మారి్పడికి ఈవీఎంలలో ఎలాంటి ఏర్పాటు ఉండదని పేర్కొన్నారు. 

ఈవీఎంలను తెరవడానికి ఎలాంటి ఓటీపీ అవసరం లేదని, వాటిపై ఉండే బటన్‌ను నొక్కడం ద్వారా ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఆమె వివరించారు. ముంబై నార్త్‌వెస్ట్‌లో శివసేన అభ్యర్థి రవీంద్ర వాయ్‌కర్‌ కేవలం 48 ఓట్లతో నెగ్గారు. రవీంద్ర వాయ్‌కర్‌ బంధువు మంగేష్‌ పాండిల్కర్‌ కౌంటింగ్‌ కేంద్రంలో ఈవీఎంకు అనుసంధానమైన మొబైల్‌ ఫోన్‌ను వాడారని, దీని ద్వారా ఈవీఎంను అన్‌లాక్‌ చేశారని, హ్యాక్‌ చేశారని మిడ్‌–డే పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. 

దీనిపై రిటరి్నంగ్‌ ఆఫీసర్‌ వందన స్పందిస్తూ.. ‘ఈవీఎంలు సాంకేతికంగా లోపరహితమైనవి. బయటినుంచి ఏ ఇతర సాంకేతిక వ్యవస్థలపై ఆధారపడకుండా స్వతంత్రంగా పనిచేస్తాయి. వాటిని ప్రోగ్రామ్‌ చేయడం కుదరదు. వైర్‌లెస్‌గా, వైర్లను కనెక్ట్‌ చేసి సమాచార మారి్పడి చేయడానికి ఈవీఎంలలో ఎలాంటి ఏర్పాటు లేదు’ అని తెలిపారు.

 రవీంద్ర వాయ్‌కర్‌ బంధువు మొబైల్‌ ఫోన్‌ ద్వారా ఈవీఎంను అన్‌లాక్‌ చేశారనే వాదనలను కొట్టిపారేశారు. ఇది శుద్ధ అబద్ధం. ఒక పత్రిక దీన్ని వ్యాపింపచేస్తోంది. మిడ్‌–డే పత్రికకు ఐపీసీ 499, 505 సెక్షన్ల కింద పరువునష్టం, అసత్య వార్తల ప్రచారానికి గాను నోటీసులు జారీచేశామని వందనా సూర్యవంశీ వెల్లడించారు. ముంబై నార్త్‌వెస్ట్‌లో శివసేన (యూబీటీ) అభ్యర్థి అమోల్‌ సజానన్‌ కీర్తికర్‌ గెలిచారని తొలుత వార్తలు వెలువడ్డాయి. అయితే రవీంద్ర వాయ్‌కర్‌ (శివసేన– షిండే) 48 ఓట్లతో గెలిచారని ఎన్నికల సంఘం ప్రకటించింది.  

మేము గెలిచినందుకేనా ఈ సందేహాలు: ఏక్‌నాథ్‌ షిండే 
ముంబై నార్త్‌వెస్ట్‌లో తమ (శివసేన) అభ్యర్థి రవీంద్ర వాయ్‌కర్‌ గెలిచినందుకే ఈవీఎంలపై అనుమానాలు రేకెత్తిస్తున్నారని మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే మండిపడ్డారు. ఈ ఒక్క నియోజకవర్గం ఫలితంపైనే ఎందుకు సందేహాలు లేవనెత్తుతున్నారు. రాష్ట్రంలోని మిగతా స్థానాల ఫలితాలపై ఎందుకు అనుమానాలు వ్యక్తం చేయడం లేదు? ఎందుకంటే ముంబై నార్త్‌వెస్ట్‌లో నా అభ్యర్థి వాయ్‌కర్‌ గెలిచారు. వారి అభ్యర్థి (శివసేన–యూబీటీ) ఓడిపోయారు.. అని షిండే వ్యాఖ్యానించారు. ప్రజాతీర్పు వాయ్‌కర్‌కు అనుకూలంగా ఉందన్నారు.  

అది డాటా ఎంట్రీ ఆపరేటర్‌ మొబైల్‌ 
రవీంద్ర వాయ్‌కర్‌ బావమరిది మంగేష్‌ పాండిల్కర్‌ కాల్స్‌ చేయడానికి, అందుకోవడానికి కౌంటింగ్‌ కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్‌ దినేశ్‌ గౌరవ్‌ ఫోన్‌ వాడారని రిటరి్నంగ్‌ ఆఫీసర్‌ వందన వెల్లడించారు. కౌంటింగ్‌ కేంద్రంలో మొబైల్‌ వాడకూడదనే అధికారిక ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు ఐపీసీ 188 సెక్షన్‌ కింద మంగే‹Ùపై పోలీసు కేసు నమోదైంది. అలాగే దినేశ్‌ గౌరవ్‌పై కూడా కేసు నమోదైంది. 

డేటా ఎంట్రీ ఆపరేటర్‌ డేటాను పొందుపర్చడానికి మాత్రమే మొబైల్‌ ఫోన్‌ను వాడాలని, ఫోన్‌తో అవసరం తీరగానే సీనియర్‌ అధికారికి అప్పగించాలని, ఎల్లప్పుడూ మొబైల్‌ ఫోన్‌ను సైలెంట్‌ మోడ్‌లోనే పెట్టాలి. దినేశ్‌ ఈ నిబంధనలను పాటించలేదని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. మొబైల్‌ ఫోన్‌కు వచ్చే వన్‌టైమ్‌ పాస్‌వర్డ్‌ (ఓటీపీ) ద్వారా డేటా ఎంట్రీ ఆపరేటర్‌.. సిస్టమ్‌లోకి లాగిన్‌ అవుతారు. డేటా ఎంట్రీ, ఓట్ల లెక్కింపు రెండు వేర్వేరు అంశాలు. 

కౌంటింగ్‌ ప్రక్రియకు, మొబైల్‌ ఫోన్‌ అనధికారిక ఉపయోగానికి ఎలాంటి సంబంధం లేదు. మొబైల్‌ ఫోన్‌ వాడకం దురదృష్టకర ఘటన, దీనిపై దర్యాప్తు జరుగుతోందని వందన వెల్లడించారు. ‘అధునాతన సాంకేతిక ఫీచర్లు, గట్టి అధికారిక నిఘా ఉందని.. అందువల్ల ఓట్లను తారుమారు చేసే అవకాశమే లేదని చెప్పారు. ప్రతిదీ అభ్యర్థులు లేదా వారి ఏజెంట్ల ఎదుటే జరుగుతుందన్నారు. రవీంద్ర వాయ్‌కర్‌ గాని, ఓటమి పాలైన అమోల్‌ కీర్తికర్‌ గాని రీ కౌంటింగ్‌ను కోరలేదని తెలిపారు. చెల్లని పోస్టల్‌ బ్యాలెట్లను పునఃపరిశీలించాలని డిమాండ్‌ చేయగా.. తాము అది చేశామని వివరించారు. అధీకృత కోర్టు ఆదేశాలు ఉంటే తప్ప సీసీటీవీ ఫుటేజీని బయటపెట్టలేమని తెలిపారు.  

ఫలితాన్ని నిలిపివేయాలి: పృథ్విరాజ్‌ చౌహాన్‌ 
ముంబై నార్త్‌వెస్ట్‌ నియోజకవర్గ ఫలితాన్ని నిలిపివేయాలని సీనియర్‌ కాంగ్రెస్‌ నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పృథ్విరాజ్‌ చౌహాన్‌ ఆదివారం డిమాండ్‌ చేశారు. భారత ఎన్నికల సంఘం అన్ని పార్టీల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ అంశాన్ని లోతుగా చర్చించాలని కోరారు. ‘మొబైల్‌ ఫోన్‌ అనధికారిక వినియోగంపై దర్యాప్తు జరగాలి. ఎఫ్‌ఐఆర్‌ను బహిరంగపర్చలేదు’ అని చౌహాన్‌ అన్నారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement