కశ్మీర్‌పై డ్రోన్లతో దాడికి పాక్‌ కుట్ర

Pakistan conspiracy to attack Kashmir with drones - Sakshi

బాంబులు కురిపించడానికి పన్నాగాలు

ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తోందంటూ ఇంటెలిజెన్స్‌ హెచ్చరిక

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ మరోసారి తన దుర్బుద్ధిని ప్రదర్శించడానికి సిద్ధమైంది. జమ్మూకశ్మీర్‌ లక్ష్యంగా డ్రోన్లతో బాంబుల వర్షం కురిపించడానికి కుట్రలు పన్నుతోంది. ఈ మేరకు పాకిస్తాన్‌ ఇంటర్‌ సర్వీస్‌ ఇంటెలిజెన్స్‌ (ఐఎస్‌ఐ) లష్కరే తోయిబా, కొందరు ఉగ్రవాదులకు శిక్షణనిస్తోంది ఇరాక్, సిరియాలౖపై దాడుల కోసం వాడుతున్న డ్రోన్లు, బాంబులు వెదజల్లే ఫ్లయింగ్‌ మిషన్లతో ఉగ్రవాద సంస్థలకి శిక్షణ నిస్తున్నట్టుగా ఇంటెలిజెన్స్‌ వర్గాలు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. తొలుత పాకిస్తాన్‌ నాసిరకమైన డ్రోన్లు వాడి వాటి వీడియోలను ప్రచారం కోసం వాడుకోవాలని అనుకుంది. కానీ ఆ తర్వాత మనసు మార్చుకొని డబ్బులు వెదజల్లుతూ అంతర్జాతీయ విపణిలో లభించే డ్రోన్లు, ఫ్లయింగ్‌ మిషన్లను తీసుకుంది. వాటితో జైషే మహమ్మద్, లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులకు శిక్షణ నిస్తోందని ఇంటెలిజెన్స్‌ వర్గాలు తెలిపాయి. 

3 కి.మీ. వరకు బాంబుల వర్షం
పాకిస్తాన్‌ ఐఎస్‌ఐ కొనుగోలు చేసిన డ్రోన్లు, ఫ్లయింగ్‌ మిషన్లు అయిదు కేజీల పేలుడు పదార్థాలను మోసుకుపోగలవు. వాటి ద్వారా మూడు కి.మీ. పరిధి వరకు విధ్వంసం సృష్టించవచ్చు. ఇస్లామిక్‌ స్టేట్‌ ఫైటర్స్‌ ఈ డ్రోన్లను కొనుగోలు చేసి మొట్టమొదటి గురి కశ్మీర్‌పైనే పెట్టినట్టుగా ఇంటెలిజెన్స్‌ హెచ్చరించింది. ఉగ్రవాదంపై పోరాటం కోసం ఏర్పాటైన యునైటెడ్‌ స్టేట్స్‌ మిలటరీ అకాడమీ సెంటర్‌కి చెందిన డాన్‌ రస్లార్‌ అనే ప్రొఫెసర్‌ చెప్పిన వివరాల ప్రకారం తొలుత పాకిస్తాన్‌ డూప్లికేట్‌ డ్రోన్లపైనే దృష్టి సారించింది. కానీ ఆ తర్వాత భారీగా నగదు వెచ్చించి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన డ్రోన్లను తీసుకుంది.

ఎలాంటి దాడినైనా తిప్పి కొడతాం: భారత్‌
పాక్‌ వైపు నుంచి వచ్చిన ఏ ముప్పునైనా తిప్పికొట్టడానికి భారత్‌ సిద్ధంగా ఉంది. సరిహద్దు ఆవల నుంచి డ్రోన్లు, ఫ్లయింగ్‌ మిషన్లు ఏవీ వచ్చినా వెంటనే వాటిని కూల్చేందుకు సమాయత్తమవుతున్నట్టుగా సరిహద్దు భద్రతా దళానికి చెందిన అధికారి ఒకరు వెల్లడించారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top