బోర్డర్‌లో పాక్‌ కవ్వింపు చర్యలు.. ఇద్దరు ఉగ్రవాదులు అరెస్ట్‌! | Pakistan Army Violates LoC Ceasefire Again | Sakshi
Sakshi News home page

బోర్డర్‌లో పాక్‌ కవ్వింపు చర్యలు.. ఇద్దరు ఉగ్రవాదులు అరెస్ట్‌!

Apr 26 2025 7:48 AM | Updated on Apr 26 2025 8:32 AM

Pakistan Army Violates LoC Ceasefire Again

శ్రీనగర్‌: భారత్‌, పాకిస్తాన్‌ సరిహద్దుల్లో పాక్‌ ఆ‍ర్మీ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. పదేపదే కాల్పులు జరుపుతూ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. తాజాగా పాక్‌ ఆర్మీ మరోసారి.. నియంత్రణ రేఖ(LOC) వెంబడి కాల్పుల జరిపింది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన భారత ఆర్మీ.. పాక్‌ చర్యలను తిప్పికొట్టింది.

వివరాల ప్రకారం.. భారత్‌, పాక్‌ సరిహద్దుల్లోని నియంత్రణ రేఖ(LOC) వద్ద పాక్‌ ఆర్మీ శుక్రవారం రాత్రి కాల్పులు జరిపింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ భారత చెక్‌పోస్టుల వద్ద రెచ్చగొట్టే ధోరణితో కాల్పులకు తెగబడింది. భారత ఆర్మీ చెక్‌పోస్టులను టార్గెట్‌ చేసి ఫైరింగ్‌ చేసింది. దీంతో, వెంటనే అప్రమత్తమైన భారత ఆర్మీ ప్రతిదాడులు జరిపింది. అయితే, ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని భారత ఆర్మీ వెల్లడించింది. ఏప్రిల్‌ 25-26 అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకున్నట్లు రక్షణశాఖ అధికారులు శనివారం వెల్లడించారు. అలాగే, ఏప్రిల్‌ 24-25 అర్ధరాత్రి వేళ కూడా పాక్‌ ఎల్ఓసీ వద్ద కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే.

మరోవైపు.. కుల్గాం జిల్లాలో టెర్రరిస్టులతో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్‌ చేసినట్టు తెలుస్తోంది. వీరిద్దరూ కోయిమాహ్‌లోని తోకిర్‌పురాకు చెందిన వారిగా గుర్తించారు. 

ఇదిలా ఉండగా.. పహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో భారత్‌, పాక్‌ మధ్య ​యుద్ధ వాతావరణం నెలకొంది. పాక్‌తో దౌత్య సంబంధాలకు సంబంధించి భారత్‌ కీలక నిర్ణయాలు తీసుకుంది. సింధూ జలాల ఒప్పందం అమలును నిలిపివేయడంతో పాటు పాక్‌ పౌరులు తక్షణమే భారత్‌ విడిచివెళ్లాలని ఆదేశించింది. ఈ చర్యలతో దాయాది దేశం అక్కసు వెళ్లగక్కింది. సిమ్లా ఒప్పందంతోపాటు మిగిలిన ద్వైపాక్షిక ఒప్పందాలను పక్కనబెడుతున్నట్లు ప్రకటించింది. తమ గగనతలంలో భారత్‌కు చెందిన విమానాలకు అనుమతిని నిలిపేస్తున్నట్లు వెల్లడించింది. ఈ పరిణామాల వేళ సరిహద్దుల్లో కాల్పులు చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement