మమ్మీ డాడీ సారీ.. నిద్రపట్టక రాత్రుళ్లు లేడీస్‌ హాస్టల్‌లోనే తిరుగుతూ.. చివరికి ఆత్మహత్య

Odisha: Unable To Sleep Student Dies By Suicide - Sakshi

భువనేశ్వర్‌: ఇప్పుడున్న ఒత్తిళ్లలో ఆందోళన, ఇతర మానసిక సమస్యలు తలెత్తడం సహజంగా మారింది. అయితే వాటికి పరిష్కారాలు వైపు వెళ్లకుండా.. తీవ్ర నిర్ణయాలు తీసుకుంటోంది నేటి తరం. తాజాగా ఓ అమ్మాయి.. నిద్ర కారణంతో అఘాయిత్యానికి పాల్పడి తల్లిదండ్రులకు శోకం మిగిల్చింది.

గత కొన్నిరోజులుగా నర్సింగ్‌ చదువుతున్న ఆ అమ్మాయి నిద్రపోవట్లేదు. రాత్రిళ్లు హాస్టల్‌లో తిరుగుతూ అందరిలో ఆందోళన రేకెత్తించింది. అందుకే ఆమెను ఇంటికి తీసుకెళ్లాలని, అప్పుడైనా మామూలుగా అవుతుందేమో చూడాలని తల్లిదండ్రులకు సమాచారం అందించారు హాస్టల్‌ నిర్వాహకులు. కానీ, ఇంతలోనే.. 

ఒడిశా బాలోంగిర్‌కు చెందిన 19 ఏళ్ల అమ్మాయి.. భువనేశ్వర్‌ జముకోలిలో ఓ ప్రైవేట్‌ హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటోంది. అయితే గత కొన్నిరోజులుగా ఆమెకు కంటి నిండా నిద్ర పట్టడం లేదట. ఈ కారణంతోనే రాత్రిళ్లు హాస్టల్‌లో తిరుగుతూ మిగతా వాళ్లను ఇబ్బంది పెడుతోంది. ఇది గమనించిన నిర్వాహకులు ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వాళ్లు వచ్చేలోపే ఆమె ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. 

తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని, నిద్ర పట్టకపోవడమే సమస్య అని, తల్లిదండ్రులు తనను క్షమించాలంటూ లేఖలో పేర్కొందామె. ఫోరెన్సిక్‌ నిపుణులు అది ఆమె చేతిరాతేనని నిర్ధారించారు. ఈ కారణంతో ఆమె చనిపోవడంతో స్థానికంగా విషాదం నెలకొంది.
 

ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. 
ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top