దేశంలోనే అత్యంత అవినీతిపరుడు
తాము గెలిస్తే జైలుకు పంపుతామని హెచ్చరిక
Assam Assembly Election 2026 గోలాఘాట్: అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మపై కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. దేశంలోని ముఖ్యమంత్రుల్లోనే అత్యంత అవినీతి పరుడు హిమంత బిశ్వ శర్మ అంటూ ధ్వజమెత్తారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే హిమంతపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆదివారం రాహుల్ అస్సాంలోని బిశ్వనాథ్, గోలాఘాట్ జిల్లాల్లో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీల్లో ప్రసంగించారు.
రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం వివిధ వర్గాల ప్రజల మధ్య విద్వేషాలను వ్యాప్తి చేస్తోందన్నారు. ‘మరికొన్ని రోజులు ఆయన్ను మాట్లాడనివ్వండి. ఆ తర్వాత అస్సాంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటవుతుంది. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. క్షమాపణ కోరినా వదిలేది లేదు. 10–15 రోజుల్లోనే ఆయన్ను జైలుకు పంపుతాం’అని పేర్కొన్నారు. శర్మ కుటుంబసభ్యుల అవినీతిపైనా చర్యలు తప్పవన్నారు.
ఇదీ చదవండి: ఇద్దరు చిన్నారులను మింగేసిన రెడీ మేడ్ దోస పిండ
సీఎం హిమంతతో కలిసి ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా అస్సాంలో ‘ల్యాండ్ ఏటీఎం’ఏర్పాటు చేసి ప్రజల భూముల్ని బడాబాబులకు కట్టబెడుతున్నారని రాహుల్ ఆరోపించారు. ఇప్పటికే 98 వేల బిఘాల భూమి మూడు కార్పొరేట్ సంస్థలకు బదలాయించారని అన్నారు. ఈ సంస్థలు బీజేపీకి ఆర్థికంగా దన్నుగా నిలుస్తున్నాయన్నారు. అమెరికా ప్రభుత్వంతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందం ఫలితంగా అమెరికా వస్తువులు మన మార్కెట్లను ముంచెత్తనున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మన రైతులు తీవ్రంగా నష్టపోతారని తెలిపారు. అస్సాంను ఐక్యంగా ఉంచేందుకు జీవితాంతం కృషి చేసిన గాయకుడు జుబీన్ గర్గ్ తమ పార్టీకి ఆదర్శమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చెప్పారు. ఆయన మాదిరిగా అస్సాం ప్రజలను ఐక్యంగా ఉంచేందుకు కృషి చేయాలంటూ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి: 17 కిలోల బంగారం, రూ. 25 కోట్లు : వ్యాపారుల గుండెల్లో రైళ్లు


