గుజరాత్లోని అహ్మదాబాద్లో కలుషిత ఆహారం తిని ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడిన ఘటన కలకలం రేపింది. తల్లితండ్రులు ఆసుపత్రిలో ప్రాణాపాయ చికిత్స పొందుతున్నారు. నగరవ్యాప్తంగా అనేక హోటళ్లలో ఆహారం కలుషితమైన ఘటనలు పదేపదే నమోదవుతున్న నేపథ్యంలో మరో విషాదం తీవ్ర ఆందోళన రేపుతోంది.
ఈ ఘటన చంద్ఖేడా ప్రాంతంలో జరిగింది. ఫుడ్ పాయిజనింగ్ కారణంగా ఇద్దరు బాలికలు ప్రాణాలు కోల్పోగా, వారి తల్లిదండ్రులు ఆసుపత్రి పాలయ్యారు. వీరు మార్కెట్ నుంచి రెడీ మేడ్ దోస పిండిని (ఖీరు) కొనుగోలు చేశారు ఆ పిండితో చేసిన దోసెలు తిన్న తర్వాత, కుటుంబ సభ్యులందరూ అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆసుపత్రికి తరలించినప్పటికీ రాహా (మూడు నెలల పసికందు), మిశ్రి(నాలుగేళ్ల బాలిక) చికిత్స పొందుతూ మరణించారు. మరోవైపు తల్లి భవనా ప్రజాపతి, తండ్రి విమన్ ప్రజాపతి కూడా ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు, వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
అయితే, సాధారణంగా పసిపిల్లలకు ఘన ఆహారం ఇవ్వరు కాబట్టి, ఫుడ్ పాయిజనింగ్కు గురైన తర్వాత తల్లి బిడ్డకు పాలివ్వడం వల్లనే మూడు నెలల పసికందు ప్రభావితమై ఉండవచ్చని భావిస్తున్నారు.
“మా అబ్బాయి రాత్రి సుమారు 8:00 గంటలకు ఐఓసీ రోడ్డులోని ఘనశ్యామ్ డెయిరీ నుంచి పిండి తెచ్చాడు. దానితో దోసె వేసుకుని తిన్నాడు. మరుసటి రోజు ఉదయం, అతనికి వాంతులు మొదలవడంతో ఆసుపత్రిలో చేర్పించాం. ఆ తర్వాత, ఆహారం వల్ల అనారోగ్యం వచ్చిందని తెలియని అతని భార్య కూడా అదే పిండిని తిని, వారి చిన్నారికి దోసె తినిపించింది. మరుసటి రోజు నుంచి, వారికి కూడా వాంతులు మొదలయ్యాయి’’ అని విమల్ తండ్రి, గౌరీశంకర్ తెలిపారు. ప్రస్తుతం తన కొడుకు కోడలు కేడీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, ఈ విషయంలో పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇదిలా ఉండగా, చంద్ఖేడా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆహార నమూనాలను సేకరించారు. మరణానికి మరణినాకి ఖచ్చితమైన కారణాన్ని నిర్ధారించుకోవడానికి, పోలీసులు ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (FSL) సహాయాన్ని కూడా కోరారు. ఫుడ్ పాయిజనింగ్ కేసు, పిండిలో కల్తీ, లేదా మరేదైనా అనుమానాస్పద కారణమా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: నో ఫుడ్,నో ఫోన్, చిమ్మ చీకటి, భయంకర శబ్దాలు : కట్ చేస్తే!
ఈ ఘటనపై ఘనశ్యామ్ డైరీ యజమాని కేతన్ పటేల్ ఇలా అన్నారు, తాముతిరోజూ సుమారు 100 నుండి 125 కిలోల ఖీరును విక్రయిస్తాం, చాలా వినియోగదారులున్నారు, దీన్ని ఘనశ్యామ్ డైరీలోనే తయారు చేస్తాం. ఒకవేళ ఆ పిండి నిజంగానే పాడై పోయి ఉంటే, పలువురు వినియోగదారుల నుండి అనేక ఫిర్యాదులొచ్చి ఉండేవి. ఈ ఒక్క ఫిర్యాదు తప్ప, మరెవరి నుండీ ఇటువంటి ఫిర్యాదు రాలేదని తెలిపారు. దర్యాప్తునకు తాము సహకరిస్తున్నామని చెప్పారు.
ఇదీ చదవండి: ప్రముఖ టీవీ నటి ఆత్మహత్య, షాక్లో ఇండస్ట్రీ
మరోవైపు అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆహార విభాగం అధికారి డాక్టర్ తేజస్ షా మాట్లాడుతూ, ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని తెలిపారు.


