అడవుల్లో తప్పిపోయి నాలుగురోజుల పాటు తిండీ తిప్పలు లేకుండా ఒంటరిగా గడిపింది. ఎటు చూసినా భయంకరమైన శబ్దాలతో తీవ్ర భయభ్రాంతులకు లోనైంది. మరోవైపు ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. చివరికి క్షేమంగా బయటపడిన వైనం విశేషంగా నిలిచింది. అసలేం జరిగింది?
కేరళలోని కోజికోడ్కు చెందిన జి.ఎస్. శరణ్య (36), కొచ్చిలోని ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తున్నారు. గురువారం ఉదయం 8 గంటలకు 12 మంది సభ్యుల బృందంతో కలిసి ట్రెకింగ్ బయలుదేరారు. కొండపైకి చేరి, కిందకు దిగుతుండగా, మిగిలినవారితో పోలిస్తే వేగంగా నడిచి ముందుకు వెళ్లింది. ఆమె వెనక్కి తిరిగి చూసినప్పుడు, వారు ఒక బండరాయిపై కూర్చుని కనిపించారు. వస్తారులే అని అక్కడే కూచ్చుంది. మళ్ళీ వెనక్కి తిరిగి చూసేసరికి, వారు ఎక్కడా కనిపించలేదు. పిట్స్టాప్కు చేరుకుని ఇతర ట్రెక్కర్ల కోసం వెతికింది. అలా శరణ్య ఆ అడవుల్లో దారి తప్పిపోయింది.
ఇదీ చదవండి: 5 నెలల్లో మూడోది : మెరైన్ ఇంజనీరింగ్ విద్యార్థి దుర్మరణం
హోమ్ స్టే యజమానికి ఫోన్ చేసి తాను దారి తప్పానని, అధికారులకు తెలియజేయమని సమాచారం ఇచ్చింది. నేను తప్పిపోయిన అన్న మెసేజ్ స్నేహితులికిచ్చేలోపే ఫోన్ స్విచాఫ్ అయిపోయింది. నిస్సహాయ స్థితిలో ఉన్న శరణ్య, ఒక వాగు పక్కన ఉన్న పెద్ద రాయిపై కూర్చుని తనను ఎవరైనా రక్షిస్తారా అని ఎదురు చూస్తూ గడిపింది. ట్రెకింగ్ వెళ్లినందువల్ల వెంట పెద్దగా ఆహారం కూడా ఏమీ తీసుకెళ్లలేదు. కేవలం అర లీటర్ వాటర్ బాటిల్ మాత్రమే ఉంది. ఇక తప్పని పరిస్థితుల్లో ఆకలిని తట్టుకునేందుకు వాగులోని నీటినే రోజుకు 3 లీటర్ల చొప్పున తాగుతూ కాలం గడిపింది.
చుట్టూ చీకటి, భయంకరమైన శబ్దాలు
పైగాఅది వన్యప్రాణులు సంచరించే ప్రాంతం అది. ఏనుగులు తిరిగే ఆ ప్రాంతంలో రాత్రిపూట నాలుగు వైపుల నుంచీ వింత శబ్దాలు వినిపించినా, ఆమె ధైర్యాన్ని కోల్పోకుండా ఆత్మవిశ్వాసంతో నిలబడింది. చివరికి ఒక మారుమూల ప్రాంతంలో స్థానిక నివాసితులు ఆమెను గుర్తించారు. ఒక భావోద్వేగభరిత క్షణాలమధ్య తన ఇద్దరు మామయ్యలు, ఒక సోదరుడు , ఆఫీసు సహోద్యోగులను కలుసుకుంది. ఆదివారం నాడు ఆమె అడవి నుండి బయటకు రావడంతో రెస్క్యూ టీమ్, కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
ఈ ఘటపై స్పందిస్తూ ఆశ్చర్యకరంగా తనకు పెద్దగా ఆకలి, భయం వేయలేదని తన అనుభవాన్ని శరణ్య గుర్తు చేసుకుంది. భవిష్యత్తులో కూడా తాను ట్రెకింగ్ కొనసాగిస్తానని ఆమె ధైర్యంగా చెప్పడం విశేషం


