
హర్నాట్ స్థానం నుంచి బరిలోకి నిశాంత్?
సాక్షి, న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు అన్ని పార్టీలు కార్యాచరణ సిద్ధం చేస్తున్న వేళ అధికార జేడీయూలో వారసుడి రాజకీయ ఆరంగేట్రం హాట్టాపిక్గా మారింది. జేడీయూ అధినేత, సీఎం నితీశ్ కుమార్(74) కుమారుడు నిశాంత్ కుమార్ క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగిడనున్నారనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇటీవలి కాలంలో తండ్రితో కలిసి నిశాంత్ కుమార్ బహిరంగ వేదికలపై దర్శనమిస్తున్న నేపథ్యంలో ఆయన రాజకీయాల్లోకి రావడం ఖాయంగానే కనిపిస్తోంది.
నిశాంత్ను రానున్న ఎన్నికల్లో పోటీకి నిలపాలని పార్టీ ఎమ్మెల్యే వినయ్ చౌదరి ఇటీవల డిమాండ్ చేశారు. మరో మంత్రి జామా ఖాన్ దీనిని బలపరుస్తూ వ్యాఖ్యలు చేశారు. నిశాంత్కు మంచి రాజకీయ అవగాహన ఉందని, ఆయన యువతకు స్ఫూర్తిని ఇవ్వగలరని వ్యాఖ్యానించారు. ప్రస్తుత ఎన్నికల్లోనే పోటీ చేయించేలా త్వరలో జరిగే శాసనసభా పక్ష భేటీల్లో ఈ విషయం ప్రస్తావిస్తామని ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రకటనలు చేస్తున్నారు. మొన్నటి వరకు రాజకీయాలకు దూరంగా ఉన్న నిశాంత్, గడిచిన ఆరు నెలలుగా తండ్రితో కలిసి పార్టీ వేదికలపై కనిపిస్తున్నారు.
నిశాంత్ నలంద జిల్లాలోని హర్నాట్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలంటూ ఆ పార్టీ నేతల నుంచి సైతం డిమాండ్లు వస్తున్నాయి. హర్నాట్ స్థానంలో జేడీయూకు బలమైన పట్టుంది. గత 20 ఏళ్లుగా అక్కడ ఆ పార్టీ నేతలే ప్రాతిని«ధ్యం వహిస్తున్నారు. వాస్తవానికి, నితీశ్ తన ఎన్నికల ప్రయాణాన్ని ఈ స్థానం నుండే ప్రారంభించారు. ప్రస్తుతం పార్టీకే చెందిన హరినారాయణ్ సింగ్ ఆ స్థానం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. వరుసగా మూడుసార్లు ఈ స్థానాన్ని గెలుచుకున్నారు. ఈ నేపథ్యంలోనే హర్నాట్ స్థానం నుంచి పోటీపై చర్చ జరుగుతోంది. దీనిపై ప్రతిపక్ష ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్..‘ఇది ప్రజాస్వామ్యం. ఎవరైనా, ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చు. నిశాంత్ను రాజకీయాల్లోకి స్వాగతిస్తున్నా’అని వ్యాఖ్యానించారు.