G20 Summit: ఢిల్లీ డిక్లరేషన్‌పై ఏకాభిప్రాయం సాధించిన భారత్ | G20 Summit 2023 Updates: New Delhi Declaration At G20 Summit Focuses On These 5 Issues - Sakshi
Sakshi News home page

G20 Summit: ఢిల్లీ డిక్లరేషన్‌పై ఏకాభిప్రాయం సాధించిన భారత్

Published Sat, Sep 9 2023 7:36 PM

New Delhi Declaration At G20 Summit Focuses On These 5 Issues - Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీ వేదికగా జరుగుతున్న జీ20 సదస్సులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన ఢిల్లీ డిక్లరేషన్‌కి సభ్యులందరూ ఆమోదం తెలిపారు. ఈ విషయాన్ని జీ20 నిర్వాహక బృందం ప్రతినిధి అమితాబ్ కాంత్ ఎక్స్(ట్విట్టర్) ద్వారా వెల్లడించారు. డిక్లరేషన్‌లో భాగంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన అంశంపై కొంత మేర భేదాభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ చివరకు సభ్యులు ఏకాభిప్రాయం తెలిపి డిక్లరేషన్‌ని స్వాగతించారు. 

ప్రధాని ప్రకటన.. 
ఢిల్లీలోని భారత్ మండపం వేదికగా జరుగుతున్న జీ20 సదస్సులో ప్రెసిడెన్సీ హోదాలో భారత్ అపూర్వ ఘట్టాన్ని ఆవిష్కరించింది. సదస్సులో ప్రధాని చేసిన కీలక ప్రకటనకు సభ్య దేశాలు ఆమోదం తెలిపిన విషయాన్ని ప్రకటిస్తూ.. అందరికీ ఒక శుభవార్త, నిర్వాహక బృందం సమిష్టి కృషి ఫలితంగా న్యూ ఢిల్లీ డిక్లరేషన్‌ విషయంలో సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. ఈ సందర్బంగా ఈ డిక్లరేషన్‌ని ఆమోదం పొందినట్లు ప్రకటిస్తున్నాను. దీని కోసం విశేష కృషి చేసిన నిర్వాహక అధికారులకు, మంత్రులకు కృతఙ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు.       

ప్రధాని మార్కు డిక్లరేషన్.. 
జీ20 షెర్పా అమితాబ్ కాంత్ తన ఎక్స్(ట్విట్టర్) ద్వారా ఈ డిక్లరేషన్‌లో ప్రధానంగా నాలుగు 'P'ల గురించి ప్రస్తావించారని అవి Planet(భూమి), People(ప్రజలు), Peace(శాంతి), Prosperity(శ్రేయస్సు) కాగా ఐదవ 'P'గా ప్రధాని మార్కు ఉందని నరేంద్ర మోదీని కొనియాడారు. ఢిల్లీ డిక్లరేషన్‌లో భాగంగా ముఖ్యంగా ఐదు అంశాలపై ఏకాభిప్రాయం కుదిరినట్లు తెలిపారు.
1.బలమైన,స్థిరమైన,సమతుల్యమైన సమగ్రాభివృద్ధి
2.సుస్థిరమైన అభివృద్ధి
3.సుస్థిర భవిష్యత్ కోసం హరిత అభివృద్ధి ఒప్పందం
4.21వ శతాబ్దానికి బహుపాక్షిక సంస్థలు
5.బహుపాక్షికతను పునరుద్దరించడం

ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన డిక్లరేషన్.. 
ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం సాధించడం ఈ సమావేశాల్లో భారత్ సాధించిన అపూర్వ విజయం.  ప్రధాని ప్రకటించిన ఢిల్లీ డిక్లరేషన్ డ్రాఫ్టులో ఎక్కడా 'రష్యా' పేరును ప్రస్తావించకుండా ఉక్రెయిన్ పరిస్థితిని కళ్ళకు కడుతూ అక్కడి ప్రాదేశిక సమగ్రతకు వ్యతిరేకంగా ఎటువంటి చర్యలకు పాల్పడవద్దని సభ్యదేశాలను కోరింది. జీ20 సదస్సు భౌగోళిక రాజకీయ భద్రతా వ్యవహారాలను పరిష్కరించే వేదిక కాదని ప్రపంచ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు మాత్రమే ఇది వేదికని తెలిపింది. 

సార్వభౌమత్వం, అంతర్జాతీయ చట్టాలు, ప్రాదేశిక సమగ్రతకు సంబంధించిన సిద్ధాంతాలను అన్ని దేశాలు గౌరవించాలని, ఒక దేశ స్వాతంత్ర్యానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోరాదని కోరింది. ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన ఈ 37 పేజీల డాక్యుమెంట్ 100 శాతం ఏకాభిప్రాయం సాధించినట్లు అమితాబ్ కాంత్ తెలిపారు. యుద్ధంలో బాధిత దేశాలకు ఆర్ధికచేయూతే ఈ సదస్సు ప్రధాన ఉద్దేశమని పేర్కొంది. యుద్ధంలో అణ్వాయుధాలు వినియోగించడం కూడా ఆమోదయోగ్యం కాదని డిక్లరేషన్‌లో  తెలిపింది. 

ఇది కూడా చదవండి: ఢిల్లీ డిక్లరేషన్ ఆమోదం.. ప్రధాన ఐదు అంశాలు ఇవే..

Advertisement
Advertisement