ముంబై: మహారాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదంపై కుట్ర కోణం తెరపైకి వచ్చింది. అజిత్ పవార్ విమాన ప్రమాదంపై అనేక అనుమానాలు ఉత్పన్నమవుతున్న వేళ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) ఎమ్మెల్సీ అమోల్ మిట్కరి సంచలన వ్యాఖ్యలు చేశారు. అజిత్ పవార్ విమాన ప్రమాదంలో కుట్ర కోణం దాగుందన్నారు. విమానం పైలెట్ ఆత్మాహుతి దాడికి పాల్పడి ఉంటారన్న అనుమానం వ్యక్తం చేశారు.
మహారాష్ట్రలోని అకోలా జిల్లాలో శివాజీ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఎన్సీపీ ఎమ్మెల్సీ అమోల్ మిత్కారి మాట్లాడుతూ.. అజిత్ పవార్ విమాన ప్రమాద ఘటనకు భారత రాజకీయ చరిత్రలో అత్యంత విషాదకరమైన ఘటనగా నిలిచిన మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్యోందంతో పోల్చారు. ఆయన వ్యాఖ్యలు మహారాష్ట్రలో తీవ్ర చర్చలకు దారితీశాయి. ఈ వ్యాఖ్యలు కేవలం ప్రమాదంపై అనుమానాలను మాత్రమే కాకుండా, దాని వెనుక కుట్ర ఉందా అనే ప్రశ్నలను కూడా లేవనెత్తాయి.
ఈ వివాదం నేపథ్యంలో, రాజకీయ నాయకులు, ప్రజలు, మీడియా వర్గాలు పారదర్శకత కోసం డిమాండ్ చేస్తున్నారు. డీజీసీఏ, ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించాయి. అయితే, మిట్కరి చేసిన వ్యాఖ్యలు ఈ దర్యాప్తుపై మరింత ఒత్తిడి పెంచాయి.
మహారాష్ట్రలో ఈ ఘటనతో రాజకీయ వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది. అజిత్ పవార్ మరణం దిగ్భ్రాంతిని గురి చేయగా.. ఇప్పుడు ఈ వివాదాస్పద వ్యాఖ్యలు ఆయన మరణం చుట్టూ ఉన్న అనుమానాలను మరింతగా పెంచుతున్నాయి. అజిత్ పవార్ మరణంపై స్పష్టత రావాల్సి ఉంది.


