‘పోయింది అనుకున్న మ్యాచ్‌ గెలిచారు.. నన్ను క్షమించండి’ | MP Shashi Tharoor apologises to Team India after Oval Test win | Sakshi
Sakshi News home page

‘పోయింది అనుకున్న మ్యాచ్‌ గెలిచారు.. నన్ను క్షమించండి’

Aug 4 2025 8:23 PM | Updated on Aug 4 2025 8:47 PM

MP Shashi Tharoor apologises to Team India after Oval Test win

ఇంగ్లండ్‌పై ఓవల్‌ వేదికగా అనూహ్య విజయం సాధించిన టీమిండియాపై కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ ప్రశంసలు కురిపించారు. ఇదొక చారిత్రాత్మక విజయమని కొనియాడారు.  మన చేతుల్లో మ్యాచ్‌లో లేదు.. పోయింది అనుకున్న సమయంలో టీమిండియా ఆటగాళ్లు అద్భుతం చేశారన్నారు. తాను కూడా మ్యాచ్‌ మన నుంచి చేజారిపోయిందనే అనుకున్నానని, అయితే అది తప్పు అని నిరూపించి మన ఆటగాళ్లు అద్భుతమే సృష్టించారని పొగడ్తల వర్షం కురిపించారు. అదే సమయంలో మ్యాచ్‌ ఓడిపోయే అవకాశం ఉందని తాను చెప్పిన దానికి బదులుగా టీమిండియా సభ్యులకు క్షమాపణలు తెలియజేశారు శశిథరూర్‌.

 

‘మ్యాచ్‌ను టీమిండియా కోల్పోతుందనే అనుకున్నా.  ఓటమి ఖాయమని చెప్పాను. అయితే అది తప్పైంది. మన మీద మనం నమ్మకం ఉంచితే అద్భుతాలు సృష్టించవచ్చనే దానికి ఇదొక నిదర్శనం. ఎప్పుడూ మీపై నమ్మకాన్ని కోల్పోకండి’ అంటూ శశిథరూర్‌ తన సోషల్‌ మీడియా అకౌంట్‌ ‘ఎక్స్‌’ ద్వారా ట్వీట్‌ చేశారు. ఇంగ్లండ్‌తో చివ‌రి వ‌ర‌కు ఉత్కంఠగా సాగిన  ఐదో టెస్టులో టీమిండియా ఆరు పరుగుల తేడాతో సంచనల విజయం సాధించింది.

లార్డ్స్ టెస్టులో బ్యాట్‌తో జ‌ట్టును గెలిపించ‌లేక‌పోయిన సిరాజ్‌.. ఓవ‌ల్‌లో మాత్రం బంతితో త‌న జ‌ట్టుకు చారిత్ర‌త్మ‌క విజ‌యాన్ని అందించాడు. ఈ కీల‌క పోరులో సిరాజ్ సంచ‌ల‌న ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. బుమ్రా లేని లోటును తెలియ‌నివ్వ‌లేదు. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు ప‌డ‌గొట్టిన సిరాజ్‌.. రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల‌తో స‌త్తాచాటాడు. మొత్తంగా 9 వికెట్లు ప‌డ‌గొట్టి ప్లేయ‌ర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ టెస్టులో విజయం సిరీస్‌ను భారత్‌ 2-2తో సమం చేసింది. ఒక మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. 

Advertisement
 
Advertisement
Advertisement