
నిందితుడు టెక్కీ, బెంగళూరులో ఘటన
బెంగళూరు: బెంగళూరులో ఘోరం చోటుచేసుకుంది. ఓ టెక్కీ.. వివాహితను కత్తితో పొడిచి హత్య చేశాడు. సుబ్రమణ్యపుర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగితే, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హరిణి (35) హత్యకు గురైన మహిళ కాగా, యశస్ (25) అనే ఐటీ ఇంజినీరు నిందితుడు. ఇద్దరు కూడా కెంగేరి నివాసులు కాగా, పూర్ణ ప్రజ్ఞా లేఔట్లో ఓయో రూమ్లో ఘటన జరిగింది.
గత శుక్రవారం ఇద్దరూ రూంని తీసుకున్నారు. గొడవ జరిగి యశస్ కత్తితో ఆమెను కిరాతకంగా హత్య చేశాడని పోలీసులు తెలిపారు. హరిణికి పెళ్లయి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. నిందితుడు అవివాహితుడు. వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ఏడాది నుంచి అనైతిక బంధానికి దారి తీసిందని సమాచారం. తాను ఈ బంధాన్ని కొనసాగించలేనని హరిణి చెప్పగా, నిందితుడు కోపంతో ప్రాణాలు తీశాడని అనుమానాలున్నాయి. హరిణి మృతదేహంపై 17కు పైగా కత్తిపోట్లు ఉన్నాయి.