
కలకత్తా హైకోర్టు మాజీ న్యాయమూర్తి 'అభిజిత్ గంగోపాధ్యాయ' ఇటీవల భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు. దీనిపైన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆయనను 'బెంచ్పై కూర్చున్న బీజేపీ బాబు' అని వ్యాఖ్యానించారు. అంతే కాకుండా రాబోయే లోక్సభ ఎన్నికల్లో గెలవకుండా చూసుకుంటానని ప్రతిజ్ఞ చేశారు.
అభిజిత్ గురించి మమతా బెనర్జీ మాట్లాడుతూ.. ఈ ప్రమాదకరమైన పాములు బెంగాల్ ప్రజలకు ఉద్యోగాలు రాకుండా చేస్తున్నాయని, రాజకీయ పక్షపాతంతో పశ్చిమ బెంగాల్కు వ్యతిరేకంగా పాలన సాగిస్తున్నారని అన్నారు. బీజేపీ బాబు అప్పుడు బెంచ్లో కూర్చున్నారు, ఇప్పుడు పార్టీలో చేరారు. అలాంటి వారి దగ్గర నుంచి న్యాయం ఎలా ఆశించాలి? ఇప్పుడు ముసుగు తొలగిపోయిందని, అసలు నిజాలు బయటపడుతున్నాయని అన్నారు.
2024 లోక్సభ ఎన్నికలకు ముందు పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరిన అభిజిత్ గంగోపాధ్యాయ.. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర నాయకులు ఉన్న కొత్త ప్రపంచంలోకి నేను ప్రవేశించాను, పార్టీ నాకు ఏ బాధ్యత ఇచ్చినా నా వంతు ప్రయత్నం చేస్తానని అన్నారు. ఈయనను (అభిజిత్ గంగోపాధ్యాయ) బీజేపీ తమ్లుక్ నియోజకవర్గం నుంచి పోటీకి దించే అవకాశం ఉందని సమాచారం. దీనిపైన ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.