
బ్లూ ఫిల్మ్ను మించి పోయింది
ప్రధాని మోదీపై మమత మండిపాటు
కోల్కతా: మధ్యప్రదేశ్ బీజేపీ నేత అశ్లీల వీడియో, ఆపరేషన్ సిందూర్కు సంబంధించి వ్యాఖ్యలను తప్పుబడుతూ ప్రధాని మోదీపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిప్పులు చెరిగారు. ‘మధ్యప్రదేశ్లో జరిగిన ఘటనను చూసి మీకు సిగ్గనిపించడం లేదా? వీధిలోనే బ్లూ ఫిల్మ్ చూపినట్లుగా ఉంది’అని గురువారం ఆమె మీడియా ఎదుట విమర్శలు చేశారు.
మందసౌర్కు చెందిన బీజేపీ నేత మనోహర్ లాల్ ధాకడ్ ఢిల్లీ–ముంబై ఎక్స్ప్రెస్వేపై నిలిపి ఉంచిన వాహనంలో మహిళతో అభ్యంతరకరంగా ఉన్న ఒక వీడియో బయటకు రావడంపై ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, అతడు స్థానిక పంచాయతీ సమితి సభ్యురాలి భర్త అనీ, తమ పార్టీ సభ్యుడు కాదని బీజేపీ అంటోంది. అదేవిధంగా, ఆపరేషన్ సిందూర్ తరహాలో ఆపరేషన్ బెంగాల్ చేపడతామంటూ ప్రధాని మోదీ సభలో బీజేపీ నేతలు ప్రకటించడంపై మమత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఆ వ్యాఖ్యలు విచారకరం, అవి విని షాకయ్యామని మమత పేర్కొన్నారు. ‘ఈ వ్యాఖ్యలతో ప్రధాని మోదీ, ఆయన పార్టీ నేతలు బెంగాల్ మహిళలను అవమానించారు. మేం ప్రతి ఒక్కరినీ గౌరవిస్తాం. కానీ, ఆత్మాభిమానాన్ని తాకట్టుపెట్టలేం. ఆ మాట అనడానికి ఆ నేతలకు ఎంత ధైర్యం?’అంటూ మండిపడ్డారు. ‘మహిళలంటే కనీస గౌరవం కూడా లేని నాయకుల పార్టీ బీజేపీ. ఆపరేషన్ సిందూర్పై నేనేమీ మాట్లాడలేను. మహిళలను గౌరవించాలనే విషయం గుర్తుంచుకోండి. మహిళలు తమ భర్తల నుండి సిందూరం తీసుకుంటారు. కానీ, ప్రధాని మోదీ ప్రతి స్త్రీకి భర్త కాదు.
ప్రధాని మోదీ ఆయన శ్రీమతికి సిందూరం ఎందుకివ్వలేదు?’అని ఆమె నిలదీశారు. ఆపరేషన్ సిందూర్తో రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రధాని ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. పహల్గాం ఘటనకు కారకులైన ముష్కరులను ఇప్పటికీ ఎందుకు పట్టుకోలేదని ప్రధానిని ఆమె ప్రశ్నించారు. అంతకుముందు, ప్రధాని మోదీ పాల్గొన్న సభలో బీజేపీ బెంగాల్ చీప్, కేంద్ర మంత్రి సుకాంద మజుందార్, ప్రతిపక్ష నేత సువేందు అధికారి మాట్లాడుతూ..‘ఆపరేషన్ సిందూర్ తరహాలో ఆపరేషన్ బెంగాల్ చేపట్టాలి. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీని బంగాళాఖాతంలో విసిరేయాలి’అంటూ పిలుపునివ్వడం గమనార్హం.