Major Opposition Parties Write a Letter To PM Modi - Sakshi
Sakshi News home page

ప్రధాని మోదీకి కేసీఆర్‌ సహా విపక్ష నేతల లేఖ.. ఏమన్నారంటే? 

Mar 5 2023 10:22 AM | Updated on Mar 5 2023 11:11 AM

Major Opposition Parties Write A Letter To PM Modi - Sakshi

గత కొన్ని నెలలుగా దేశంలో ప్రతిపక్ష నేతలే టార్గెట్‌గా ఈడీ(ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌), సీబీఐ, ఐటీ దాడులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీంతో, ప్రతిపక్ష నేతలు కేంద్ర ప్రభుత్వం తీరుపై మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీకి తాజాగా విపక్షాలు లేఖ రాశాయి. సీఎం కేసీఆర్‌ సహా 9 మంది విపక్ష నేతలు ప్రధానికి లేఖ రాశారు. 

ఇక, లేఖలో భాగంగా మనీష్‌ సిసోడియా అరెస్ట్‌ను ఖండించారు విపక్ష నేతలు. అలాగే, కేంద్ర దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్నదని ఆరోపించారు. 2014 నుంచి దేశంలో ఇదే పరిస్థితి ఉందన్నారు. ఇక, గవర్నర్‌ వ్యవస్థను రాజకీయాల కోసం వాడుకుంటున్నారని విమర్శించారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని పేర్కొన్నారు. ప్రజా తీర్పును గౌరవించాలని కోరారు. భారత్‌ ఇంకా ప్రజాస్వామ్య దేశమే అని నమ్ముతున్నామని ఘాటు వ్యాఖ్యలు చేశారు. విపక్ష సభ్యులపై దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్నారని అన్నారు. 

ఈడీ, సీబీఐ కేసుల్లో ఉన్న వాళ్లు బీజేపీలో చేరితే క్లీన్‌చిట్‌ ఇస్తున్నారని తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ సందర్బంగా ప్రస్తుత అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మపై శారదా చిట్‌ఫండ్‌పై 2014, 2015లో సీబీఐ, ఈడీ విచారణ జరిపాయి. ఆయన బీజేపీలో చేరిన తర్వాత కేసు పురోగతి లేదన్నారు. అలాగే, బీజేపీలో చేరిన సువేందు అధికారి, ముకుల్‌ రాయ్‌, నారాయణ్‌ రాణే వంటి మరికొందరిపై కూడా కేసులు నమోదు చేసినప్పటికీ విచారణలో జాప్యం జరుగుతోందని ఆరోపించారు. 

ఇదే క్రమంలో సిసోడియా అరెస్ట్‌ వెనుక రాజకీయ కుట్ర ఉంది. దేశంలోనే విద్యావ్యవస్థలో మంచి సంస్కరణలు తీసుకువచ్చారన్న మంచి పేరుంది. ఎటువంటి ఆధారాలు లేకుండా సిసోడియాను అరెస్ట్‌ చేశారు. సిసోడియాపై ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి అని లేఖలో పేర్కొన్నారు. ఇక లేఖ రాసిన వారిలో సీఎం కేసీఆర్‌, మమతా బెనర్జీ, స్టాలిన్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌, భగవంత్‌ మాన్‌, శరద్‌ పవార్‌, ఫరుఖ్‌ అబ్దుల్లా, తేజస్వీ యాదవ్‌, ఉద్ధవ్‌ థాక్రే, అఖిలేష్‌ యాదవ్‌ ఉన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement