కాంగ్రెస్‌ ఏటీఎంగా తెలంగాణ | Kishan Reddy Slams Congress, BRS: Telangana | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ ఏటీఎంగా తెలంగాణ

Jun 3 2026 5:53 AM | Updated on Jun 3 2026 5:53 AM

Kishan Reddy Slams Congress, BRS: Telangana

ఢిల్లీలో జరిగిన ఆవిర్భావ వేడుకల్లో నితిన్‌ నబీన్, కిషన్‌రెడ్డి, రఘునందన్‌రావు తదితరులు

ఢిల్లీకి మూటలు.. ప్రజల రక్తం, చెమట హైకమాండ్‌కు కప్పం 

ఒక అవినీతి సర్కార్‌ పోయి..  మరో అవినీతి పాలన వచ్చింది 

ఢిల్లీ తెలంగాణ భవన్‌లో ‘ఆవిర్భావ’వేడుకలు 

ధ్వజమెత్తిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రజల ఆకాంక్షలు..అమరవీరుల స్వప్నాలను సాకారం చేసే సత్తా కేవలం బీజేపీకే ఉందని ఆ పార్టీ జాతీయ నేతలు స్పష్టం చేశారు. తెలంగాణను కాంగ్రెస్‌ పార్టీ తన సొంత ఏటీఎంగా మార్చుకుందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంగళవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో తెలంగాణ బీజేపీ రాష్ట్ర శాఖ, తెలంగాణ రెసిడెంట్స్‌ ఆఫ్‌ ఢిల్లీ సంయుక్తంగా నిర్వహించిన రాష్ట్ర అవతరణ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.  

వికసిత్‌ తెలంగాణ బీజేపీతోనే సాధ్యం: నితిన్‌ నబీన్‌ 
‘జై తెలంగాణ‘నినాదంతో ప్రసంగం ప్రారంభించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌.. కాంగ్రెస్‌ అవినీతి పాలనపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. గతంలో ఒక అవినీతి ప్రభుత్వం పోయిందనుకుంటే, ఇప్పుడు అంతకంటే ఘోరమైన మరో అవినీతి సర్కార్‌ కొలువు దీరిందని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజల రక్తాన్ని, చెమటను కాంగ్రెస్‌ పార్టీ ఢిల్లీ హైకమాండ్‌కు కప్పంగా కడుతోందని ఆరోపించారు. తెలంగాణ ఏర్పాటు కోసం సుష్మా స్వరాజ్‌ పార్లమెంట్‌లో గట్టిగా నిలబడ్డారని, వాజ్‌పేయి హయాం నుంచే బీజేపీ చిన్న రాష్ట్రాలకు మద్దతుగా ఉందన్నారు. తెలంగాణ వికాసం, సమృద్ధి కేవలం మోదీ నేతృత్వంలోని ‘వికసిత్‌ తెలంగాణ’తోనే సాధ్యమన్నారు. తెలంగాణ ప్రజల కలలు సాకారమయ్యే వరకు బీజేపీ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. 

కాంగ్రెస్‌ ది ఊసరవెల్లి రాజకీయం: కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి 
పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెట్టి, వెనుక నుంచి మిర్చి పౌడర్లు, పెప్పర్‌ స్ప్రేలు కొట్టించిన ఊసరవెళ్లి రాజకీయాల చరిత్ర కాంగ్రెస్‌దని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. వందలాది మంది అమాయకుల బలిదానాలకు కారణమైన కాంగ్రెస్‌కు తెలంగాణ గురించి మాట్లాడే అర్హతే లేదన్నారు. నాడు బీజేపీకి ఒక్క ఎంపీ లేకపోయినా సుష్మా స్వరాజ్‌ అండగా నిలిచారని గుర్తు చేశారు. ‘బంగారు తెలంగాణ’పేరుతో కేసీఆర్‌ తన కుటుంబాన్ని మాత్రమే బంగారుమయం చేసుకొని, తీవ్ర అవినీతితో దోచిపెట్టారని విమర్శించారు. ఇప్పుడు వచి్చన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కూడా దానికి మినహాయింపు ఏమీ కాదన్నారు.  

సహకారంతోనే ఉభయ రాష్ట్రాల ప్రగతి: రాంచందర్‌రావు 
తెలంగాణ కేవలం ఒక భౌగోళిక ప్రాంతం కాదు..అది అసంఖ్యాక త్యాగాల ఆత్మగౌరవ ప్రతీక అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు పేర్కొన్నారు. ‘వికసిత్‌ తెలంగాణ’–‘వికసిత్‌ ఆంధ్రప్రదేశ్‌’లు పరస్పర స్నేహం, సంపూర్ణ సహకారంతో కలిసికట్టుగా అడుగులు వేసినప్పుడే ‘వికసిత్‌ భారత్‌’స్వప్నం సాకారమవుతుందని, రెండు రాష్ట్రాల ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని ఆయన స్పష్టం చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు హైదరాబాద్‌లో మీటింగ్‌ పెట్టుకోవడానికి అనుమతి నిరాకరించడం ద్వారా కాంగ్రెస్‌ ప్రభుత్వం తన ఎమర్జెన్సీ మైండ్‌ సెట్‌ను బయటపెట్టుకుందని రాంచందర్‌రావు విమర్శించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే ఒవైసీ సోదరులకు, అర్బన్‌ నక్సలైట్ల సభలకు అనుమతులిచ్చే ఈ ప్రభుత్వం పవన్‌ కల్యాణ్‌ సభను అడ్డుకోవడం అప్రజాస్వామికమన్నారు. 

సెంటిమెంట్‌ రాజకీయం సాగదు: ఎంపీ రఘునందన్‌రావు 
ఏపీకి వెళ్లి మాజీమంత్రి రోజా ఇంట్లో కేసీఆర్‌ రొయ్యల పులుసు తిన్నప్పుడు తెలంగాణ సెంటిమెంట్‌ ఏమైందని ఎంపీ రఘునందన్‌రావు ప్రశ్నించారు. కేసీఆర్, రేవంత్‌రెడ్డిలు ఇతర రాష్ట్రాలకు వెళ్లి ప్రచారం చేయొచ్చు కానీ, పవన్‌ కల్యాణ్‌ వస్తే తప్పా? అని నిలదీశారు. ఉడత ఊపులకు బీజేపీ భయపడదని, ప్రాంతాలుగా విడిపోయినా ప్రజలుగా కలిసి ఉండాలనేదే తమ నినాదమని స్పష్టం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement