సీబీఐకి మాజీ సీఎంపై లైంగిక దాడి కేసు

Kerala Government To Refer Rape Cases Against Chandy And Others To CBI - Sakshi

తిరువనంతపురం : కేరళలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికారిక ఎల్డీఎఫ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్‌ నేత, మాజీ ముఖ్యమంత్రి ఊమెన్‌ చాందీతోపాటు పార్టీలోని ఇతర నేతలపై నమోదైన లైంగిక దాడి కేసుల విచారణను సీబీఐకి అప్పగించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇందులో 2016, 2018, 2019లలో నమోదైన అయిదు కేసులను ప్రభుత్వం సీబీఐకు అప్పజెప్పనున్నట్లు పేర్కొంది. ఇదిలా ఉండగా కేరళలో గత యూడీఎఫ్‌ ప్రభుత్వంలో వెలుగు చూసినసోలార్‌ ప్యానెల్‌ స్కామ్‌లో ప్రధాన నిందితురాలుగా న్న సరితా నాయర్‌.. 2012లో వీరందరూ తనను లైంగికంగా వేధించారని గతంలో ఫిర్యాదు చేశారు. చాందీ, ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీ కేసీ వేణు గోపాల్‌, కాంగ్రెస్‌ ఎంపీలు హిబి ఎడెన్‌, అదూర్‌ ప్రకాశ్‌, మాజీ మంత్రి ఏపీ అనిల్‌ కుమార్‌, ఏపీ అబ్దుల్‌కుట్టి తనను లైంగికంగా వేధింపులకు గురిచేశారని సరితా ఆరోపించారు. అయితే  అప్పటి కాంగ్రెస్‌ నేత జోస్‌ కే మణిపై కూడా ఆరోపణలు చేసినప్పటికీ అతను అనంతరం ఎల్డీఎఫ్‌లో చేరడంతో తనపై ఎలాంటి కేసులు నమోదు కాలేదు. 

సోలార్‌ స్కాంపై దర్యాప్తు చేసిన జ్యుడిషియల్ కమిషన్ 2017లో చాందీ, వేణుగోపాల్‌తోపాటు ఇతర కాంగ్రెస్ నాయకులపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేయాలని సిఫారసు చేసింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు చాందీ, ఇతరులు తనను లైంగికంగా వేధించారని, సోలార్‌ సంస్థ ద్వారా అక్రమంగా లాభార్జన పొందటానికి అనుమంతించారని నిందితురాలు కమిషన్‌కు రాసిన లేఖలో పేర్కొంది. దీంతో వీరందరిపై క్రిమినల్ కేసులను నమోదు చేయాలని సీపీఎం ప్రభుత్వం ఆదేశించింది. అయితే ప్రభుత్వానికి న్యాయ వ్యవస్థ వ్యతిరేకంగా ఉండటంతో ఈ కేసులలో పెద్దగా పురోగతి కనిపించలేదు. అంతేగాక చాందీ హైకోర్టును ఆశ్రయించి అతనిపై ఉన్న కేసును రద్దు చేసుకున్నాడు. అలాగే లేఖలోని విషయాలను చర్చించకుండా మీడియాను నిరోధించుకున్నాడు. తర్వాత మహిళ కాంగ్రెస్‌ నాయకులపై కొత్తగా ఫిర్యాదు ఇవ్వడంతో పోలీసులు మళ్లీ కేసు నమోదు చేశారు.. అంతేగాక ఈ కేసులపై సీబీఐ దర్యాప్తు కోరుతూ ఇటీవల ఆమె ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను సంప్రదించారు. కేసులను సీబీఐకు అప్పగించడం వెనుక రాజకీయ ఉద్దేశ్యం లేదని ఆ మహిళ తెలిపింది.

అయితే దీనిపై స్పందించిన చాందీ తాను ఎలాంటి విచారణకైనా సిద్ధమని స్పష్టం చేశారు. కాగా కేరళ ప్రభుత్వ నిర్ణయాన్ని రాజకీయ దురుద్దేశంతో తీసుకున్న చర్యని కాంగ్రెస్‌ తప్పుపట్టింది.తమ పార్టీ నేతలపై ఆరోపణలను రుజువు చేయడంలో విఫలమైన ఎల్డీఎఫ్‌ ప్రభుత్వం ఎన్నికలు దగ్గరపడటంతో తమను ఇరుకునపెట్టే నిర్ణయాలు తీసుకుంటోందని దుయ్యబట్టింది. మరోవైపు మరోవైపు అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ఎల్డీఎఫ్‌ ప్రభుత్వం సీబీఐకి ఈ కేసులను అప్పగిస్తోందని విదేశీ వ్యవహారాల సహాయమంత్రి వి మురళీధరన్‌ ఆరోపించారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top