
దొడ్డబళ్లాపురం: హావేరి జిల్లా శిగ్గాంవి పట్టణంలో రెండు రోజుల క్రితం జరిగిన కాంట్రాక్టర్ శివానంద కున్నూరు (40) హత్య కేసులో నిందితులపై పోలీసులు ఫైరింగ్ చేశారు. నిందితులు అష్రఫ్, నాగరాజు కాళ్లకు తీవ్ర గాయాలు కాగా, వారికి హావేరిలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందించి మెరుగైన చికిత్స కోసం హుబ్లి కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. మూడురోజుల కిందట పట్టపగలు నలుగురు దుండగులు శివానందను కత్తులతో నరికి చంపడం జిల్లాలో సంచలనం కలిగించింది. ఈ హత్య వీడియోలు వైరల్ అయ్యాయి.
దాగి ఉండగా..
పోలీసులు నాలుగు బృందాలుగా విడిపోయి వారి కోసం శోధించారు. హానగల్ తాలూకా కొండోజి క్రాస్ వద్ద నిందితులు దాగి ఉన్నట్టు తెలిసి గురువారం తెల్లవారుజామున అరెస్టు చేయడానికి వెళ్లారు. ఆ సమయంలో నిందితులు పోలీసులపై దాడి చేసి పారిపోవడానికి ప్రయత్నించారు. శిగ్గాంవి సీఐ సత్యప్ప, ఎస్సై సంపత్ నిందితుల కాళ్లకు షూట్ చేయడంతో గాయాలై దొరికిపోయారు. ఈ ఘటనలో సత్యప్ప, సంపత్, కానిస్టేబుల్ రవికి స్వల్ప గాయాలయ్యాయి. హత్యకు ఆర్థిక వ్యవహారాలు, లేదా అక్రమ సంబంధం కారణమని అనుమానాలున్నాయి. ఇప్పటికే సుదీప్, సురేష్ గౌళి, హనుమంత అనే ముగ్గురు అరెస్టయ్యారు.