
కోల్కతా: ఆగస్టు 9వ తేదీన పశ్చిమబెంగాల్ రాజ్యసభ సీటుకు జరగనున్న ఉప ఎన్నికకు రిటైర్డు ప్రభుత్వాధికారి జవహర్ సర్కార్(69)ను తమ అభ్యర్థిగా టీఎంసీ ఎంపిక చేసింది. అధికారిగా ప్రజలకు అమూల్యమైన సేవలందించిన సర్కార్ దేశానికి మరింతగా సేవ చేసేందుకు సహాయపడతారని ఆశిస్తూ ఎంపిక చేసినట్లు టీఎంసీ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు. కాగా, టీఎంసీ నేత దినేశ్ త్రివేది రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి, బీజేపీలో చేరడంతో సీటు ఖాళీ అయింది. టీఎంసీకి పోటీగా బీజేపీ కూడా అభ్యర్థిని బరిలోకి దించితే ఉప ఎన్నిక అనివార్యమవుతుంది. లేకుంటే రాజ్యసభకు జవహర్ సర్కార్ పోటీ లేకుండానే ఎన్నికవుతారు. సర్కార్ ప్రభుత్వ ఉద్యోగిగా 42 ఏళ్లపాటు పనిచేశారు.