
న్యూఢిల్లీ: ‘‘స్వదేశీ ఆయుధాలు ఆపరేషన్ సిందూర్లో అద్భుతంగా సత్తా చాటాయి. ప్రపంచంలో ఏ దేశానికీ తీసిపోమని నిరూపించుకున్నాయి’’ అని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. భారత దాడుల్లో కోలుకోలేని నష్టాలు చవిచూసినట్టు పాక్ అంగీకరించడమే ఇందుకు తాజా నిదర్శనమన్నారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారిగా కేంద్ర మంత్రిమండలి బుధవారం ఆయన అధ్యక్షతన సమావేశమైంది.
మేకిన్ ఇండియాలో భాగంగా ఆయుధాలు, ఆయుధ వ్యవస్థల తయారీకి ప్రభుత్వం ఇస్తున్న అమితమైన ప్రాధాన్యం ఇకముందు కూడా కొనసాగుతుందని ప్రధాని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. పలు మంత్రిత్వ శాఖల పనితీరుపై పవర్పాయింట్ ప్రజెంటేషన్ జరిగింది. నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి నిరంతరం కృషి చేయాల్సిందిగా మంత్రివర్గ సహచరులకు మోదీ పిలుపునిచ్చారు.
కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి గద్దెనెక్కి జూన్ 9కి ఏడాది పూర్తవుతున్నందున ఈ 12 నెలల్లో సాధించిన ఐదు ప్రధాన విజయాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. తొలిసారిగా ఐపీఎల్ ట్రోఫీ నెగ్గిన ఆర్సీబీ జట్టుకు సన్మానం సందర్భంగా బెంగళూరులో జరిగిన తొక్కిసలాటలో మరణించిన వారికి మంత్రివర్గం సంతాపం తెలిపింది.