సిక్కింలో వర్ష బీభత్సం.. చిక్కుకుపోయిన పర్యాటకులు | Heavy Rains Caused Havoc in Sikkim | Sakshi
Sakshi News home page

సిక్కింలో వర్ష బీభత్సం.. చిక్కుకుపోయిన పర్యాటకులు

Jun 15 2024 7:19 AM | Updated on Jun 15 2024 7:35 AM

Heavy Rains Caused Havoc in Sikkim

సిక్కింలో వర్ష బీభత్సం నెలకొంది.  ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పర్యాటకులు పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. బుధవారం రాత్రి ఉత్తర సిక్కింలో 220 మి.మీకు మించిన వర్షం కురిసింది. దీంతో తీస్తాలో వరదలు సంభవించాయి. ఫలితంగా ఈ ప్రాంతంలో 1,200 మందికి పైగా స్వదేశీ, విదేశీ పర్యాటకులు చిక్కుకుపోయారు. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. తీస్తా నదిలో నీటిమట్టం పెరగడంతో ఒడ్డున ఉన్న ఇళ్లలోకి భారీగా నీరు చేరింది.

వాతావరణం అనుకూలించిన అనంతరం పర్యాటకులను ఇక్కడి నుంచి తరలించే ప్రక్రియ ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు. రోడ్డు మరమ్మతులకు ఐదు నుంచి ఆరు రోజులు పట్టవచ్చని సమాచారం. ఉత్తర సిక్కింలో శుక్రవారం కూడా భారీ వర్షం నమోదయ్యింది. ఈ విపత్తు బారిన పడి మృతిచెందినవారి సంఖ్య ఆరుకు చేరింది. గురువారం ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో ముగ్గురు గల్లంతయ్యారు.

సిక్కింలోని సంక్లాంగ్ ప్రాంతంలో వంతెన కొట్టుకుపోవడంతో చుంగ్తాంగ్, లాచుంగ్ ప్రాంతాల నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. ఈ విపత్తు పరిస్థితిని సమీక్షించేందుకు ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. బాధిత ప్రాంతాలకు సంబంధించిన పరిస్థితులపై సమాచారం సేకరించి, సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో చిక్కుకుపోయిన పర్యాటకులను ప్రత్యేక విమానంలో తరలించేందుకు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయ్ భూషణ్ పాఠక్ తెలిపారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement