గ్రీన్ యూరియా సాంకేతికతకు పెరుగుతున్న ప్రాధాన్యం
తక్కువ ఖర్చు..పర్యావరణ హితం
సరికొత్త టెక్నాలజీలో కర్బన ఉద్గారాల ముచ్చటే లేదు
తూర్పు భారత్లో ఫ్యాక్టరీ నిర్మాణానికి ఓ కంపెనీ శ్రీకారం
ఒక సంక్షోభం మరో సమస్య పరిష్కారానికి దోహదం చేస్తుంది. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో..నూటికి నూరు శాతం పర్యావరణ హితమైన గ్రీన్ యూరియా ఉత్పత్తిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. స్వీడన్ స్టార్టప్ నైట్రోక్యాప్ట్ కనిపెట్టిన గ్రీన్ యూరియా టెక్నాలజీ ప్రాధాన్యం సంతరించుకుంటోంది. ప్రముఖ స్వీడిష్ క్లీ¯న్ టెక్ స్టార్టప్ నైట్రోక్యాప్ట్ గుళికల రూపంలో ఉండే హరిత నత్రజని ఎరువుల తయారీ టెక్నాలజీని అభివృద్ధి చేసి పేటెంట్ పొందింది. మన దేశంలోని అధిక సబ్సిడీలతో నడిచే, అధిక ఉద్గారాలు వెలువరించే హేబర్–బోష్ యూరియా ప్లాంట్లకు.. పేటెంట్ పొందిన ఈ టెక్నాలజీ అత్యంత ఆచరణీయమైన ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు.
10 దేశాలు.. 34 ఒప్పందాలు
గత ఏడాది 20 లక్షల డాలర్ల ఫుడ్ ప్లానెట్ అవార్డును గెల్చుకున్న ఈ సాంకేతికతపై ఇప్పటికే పది దేశాల కంపెనీలు 34 ఒప్పందాలు చేసుకున్నాయని నైట్రోక్యాప్ట్ చెబుతోంది. తూర్పు ప్రాంతానికి చెందిన ఒక భారతీయ కంపెనీ ఈ సాంకేతికతో గ్రీన్ యూరియా ఫ్యాక్టరీ నిర్మాణానికి ఇప్పటికే శ్రీకారం చుట్టినట్టు సమాచారం. ప్రధాని మోదీ స్వీడన్ పర్యటన నేపథ్యంలో ఈ గ్రీన్ యూరియా టెక్నాలజీ వినియోగం వేగవంతమవుతుందని భావిస్తున్నారు.
సాధారణ యూరియా వర్సెస్ నైట్రోక్యాప్ట్ గ్రీన్ యూరియా
హేబర్–బోష్ ప్రక్రియ ద్వారా అమ్మోనియాను పారిశ్రామికంగా సంశ్లేషణ చేస్తారు. గ్రీన్ యూరియా ప్రక్రియలో ఇనుము ఉత్ప్రేరకాల సహాయంతో అధిక పీడనం, అధిక ఉష్ణోగ్రత వద్ద నత్రజని, హైడ్రోజన్లను కలిపి యూరియాను తయారు చేస్తారు.


