గూర్ఖాల్యాండ్‌ డిమాండ్‌ను వదిలిన మోర్చా

Gorkha Janmukti Morcha drops Gorkhaland demand - Sakshi

ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ నుంచి వెనక్కి తగ్గిన జీజేఎం

డార్జిలింగ్‌/కోల్‌కతా: ప్రత్యేక గూర్ఖాల్యాండ్‌ రాష్ట్ర సాధన కోసం దాదాపు 15 ఏళ్లుగా పోరాడుతున్న గూర్ఖా జనముక్తి మోర్చా(జీజేఎం) ఎట్టకేలకు తన ప్రధాన డిమాండ్‌ను విరమించుకుంది. నేపాలీ మాట్లాడే గూర్ఖాలు అధికంగా నివసించే పశ్చిమబెంగాల్‌లోని పర్వత ప్రాంత సమ్మిళిత అభివృద్ది కోసం ‘రాజకీయ’ పరిష్కారం చూపాలని జీజేఎం ప్రధాన కార్యదర్శి రోషన్‌ గిరి డిమాండ్‌చేశారు. ‘ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ను వదులుకుంటున్నాం. బెంగాల్‌ రాష్ట్రంలో గూర్ఖాలు ఇకపై మమేకం అవుతారు. పర్వత ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తారు’ అని రోషన్‌ చెప్పారు.

ఉత్తర బెంగాల్‌ పర్యటనలో ఉన్న సీఎం మమతా బెనర్జీతో హమ్రో పార్టీ సభ్యులతో కూడిన జీజేఎం ప్రతినిధి బృందం భేటీ అయింది. జీజేఎం నిర్ణయాన్ని అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ సహా పలు పార్టీలు స్వాగతించాయి. ప్రజా మద్దతు కోల్పోయే జీజేఎం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటోందని, ప్రత్యేక డార్జిలింగ్‌ రాష్ట్ర సాధన కోసం తమ పోరాటం కొనసాగుతుందని కుర్సేంగ్‌ బీజేపీ ఎమ్మెల్యే విష్ణు ప్రసాద్‌ శర్మ అన్నారు. జీజేఎంకు ఆయువుపట్టు లాంటి డార్జిలింగ్‌ ప్రాంతంలో హమ్రో పార్టీ హవా పెరిగిందని, ముఖ్యంగా డార్జిలింగ్‌ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఆ పార్టీ గెలవడంతో జీజేఎం పంథా మారిందని శర్మ వ్యాఖ్యానించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top