పనాజీ: గోవా ‘బిర్క్ బై రోమియో లేన్’ నైట్క్లబ్ అగ్నిప్రమాదంపై సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులు ఒక్కసారిగా షాకయ్యారు. ఈ క్లబ్కు సంబంధించిన ట్రేడ్ లైసెన్స్ 2024లోనే పూర్తయినట్లు గుర్తించారు. దీంతో, అధికారులు నిర్లక్ష్యం తెరపైకి వచ్చింది.
గోవా నైట్క్లబ్ అగ్నిప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో 2024 మార్చిలోనే ఈ నైట్క్లబ్ ట్రేడ్ లైసెన్స్ గడువు ముగిసినట్టు అధికారలుఉ గుర్తించారు. అయినప్పటికీ.. దీని నిర్వహణ ఇంకా కొనసాగుతుందని తెలుసుకున్నారు. కాగా, నిబంధనల ప్రకారం.. దీనిపై చర్యలు తీసుకునే అధికారం అక్కడి పంచాయతీ అధికారులకు ఉంది. అయినా వారు ఆ క్లబ్ గురించి పట్టించుకోకపోవడం గమనార్హం. మరోవైపు.. ఈ నైట్క్లబ్ యజమానులైన గౌరవ్ లూథా, సౌరభ్ లూథ్రాలను అరెస్టు చేసేందుకు అధికారులు ప్రయత్నించారు. అయితే, ఘటన జరిగిన వెంటనే వారు విదేశాలకు పారిపోయినట్లు అధికారులు తెలిపారు.
ఈ కేసులో ప్రధాన నిందితులు, యజమానులు సౌరభ్ లూథ్రా, గౌరవ్ లూథ్రాలు థాయ్లాండ్లోని ఫుకెట్కు పరారైనట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన చోటుచేసుకున్న గంటల వ్యవధిలోనే వారు 6E-1073 ఇండిగో విమానంలో దేశం విడిచి పారిపోయారని తెలిపారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన అనంతరం గోవా పోలీసుల అభ్యర్థన మేరకు ‘బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్’ (BOI) వారిపై లుక్ అవుట్ సర్క్యూలర్ జారీ చేసింది. ఈ ఇద్దరినీ వీలైనంత త్వరగా పట్టుకునేందుకు సీబీఐలోని ఇంటర్పోల్ విభాగంతో సమన్వయం చేసుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నట్లు ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.
Shocking video reveals panic just before the deadly Goa club fire 😱🔥
A midnight cylinder blast at Birch, Baga killed 25, mostly trapped staff.
Owner & manager arrested.
CM orders probe and statewide safety crackdown. pic.twitter.com/n69mFwEJU1— 🐰Jefnï Arul🐰 | 𝔽rAI (@ArulJefni7037) December 8, 2025
ఇదిలా ఉండగా.. ఆదివారం తెల్లవారుజామున క్లబ్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 25 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ప్రమాదంలో మరణించిన వారిలో 20 మందిని గుర్తించి వారి స్వస్థలాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. ఇక, ఈ క్లబ్ నిర్వాహకుల మధ్య వివాదాలు ఉన్నాయని, దీని కూల్చివేతకు గతంలో నోటీసులు జారీ చేశామని స్థానిక సర్పంచి రోషన్ రెడ్కర్ ఇప్పటికే పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే, కొంతమంది అధికారులు దానిని అడ్డుకున్నట్లు ఆయన తెలిపారు. ఇక, ఈ ఘటనపై మెజిస్టీరియల్ విచారణకు నలుగురు సభ్యులతో కూడిన కమిటీని ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఈ క్రమంలో రోమియో లేన్ పేరుతో ఉన్న మరో రెండు వాణిజ్య సంస్థలను కూడా అధికారులు సీజ్ చేశారు.


