నేడు మళ్లీ ఢిల్లీ చలో | Farmers to march towards Delhi on 8 Dec 2024 | Sakshi
Sakshi News home page

నేడు మళ్లీ ఢిల్లీ చలో

Dec 8 2024 6:00 AM | Updated on Dec 8 2024 6:00 AM

Farmers to march towards Delhi on 8 Dec 2024

రైతు నేత సర్వాన్‌ సింగ్‌ పాంథర్‌ వెల్లడి 

చండీగఢ్‌: కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ)కి చట్టబద్ధత సహా పలు డిమాండ్ల సాధనకు రైతు సంఘాలు చేపట్టిన చలో ఢిల్లీ కార్యక్రమం ఆదివారం తిరిగి మొదలవుతుందని రైతు సంఘం నేత సర్వాన్‌ సింగ్‌ పాంథర్‌ చెప్పారు. శంభు నుంచి శుక్రవారం మొదలైన ర్యాలీపై హరియాణా పోలీసులు బాష్పవాయువు ప్రయోగించడంతో మొత్తం 16 మంది గాయపడ్డారని, వీరిలో ఒకరు వినికిడి శక్తి కోల్పోయారని ఆయన వివరించారు. క్షతగాత్రుల్లో నలుగురు చికిత్స పొందుతుండగా మిగతా వారు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారన్నారు. 

ఈ పరిణామంతో శనివారం ర్యాలీని నిలిపివేశామని ఆయన శంభు వద్ద మీడియాకు తెలిపారు. తమ డిమాండ్లపై చర్చలకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆహా్వనం అందలేదని పాంథర్‌ చెప్పారు. తమతో చర్చలు జరిపే ఉద్దేశం ప్రభుత్వానికి ఉన్నట్లు కనిపించడం లేదన్నారు. అందుకే, 101 మంది రైతుల బృందంతో కూడిన జాతాను ఆదివారం మధ్యాహ్నం నుంచి శాంతియుతంగా తిరిగి ప్రారంభించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. శుక్రవారం రైతులపైకి పోలీసులు టియర్‌ గ్యాస్‌ ప్రయోగించడంతో కేందరంలోని బీజేపీ ప్రభుత్వం అసలు స్వరూపం బట్టబయలైందని ఆయన వ్యాఖ్యానించారు.

Advertisement
 
Advertisement
Advertisement