'ఆ ఫోటో నాదే.. నేను చనిపోలేదు'

Fact Check: Actor Picture Shared On Social Media As Doctor Became Viral - Sakshi

ఢిల్లీ : దేశవ్యాప్తంగా ఎంతోమంది కరోనా బారిన పడ్డారు. వారిలో వైద్య సిబ్బంది కూడా ప్రముఖంగా ఉన్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 87వేల మంది వైద్య సిబ్బంది కరోనా బారిన పడగా.. అందులో 2వేల మంది వైద్యులు ఉన్నట్లు అంచనా. ఇప్పటివరకు 600 మంది వైద్య సిబ్బంది ప్రాణాలు కోల్పోగా.. 300 మంది డాక్టర్లు కరోనాకు బలయ్యారు. క్లిష్ట కాలంలో వీరు చేస్తున్న సేవలకు .. వారి ప్రాణత్యాగాలకు సెల్యూట్‌ చెప్పి తీరాల్సిందే. తాజాగా అహ్మదాబాద్‌కు చెందిన యువ గైనకాలజిస్ట్‌ డాక్టర​ విధి కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారంటూ సోషల్‌మీడియాలో ఒక ఫోటో చక్కర్లు కొట్టింది. దీనిపై సోషల్‌మీడియాలో నెటిజన్లు ఆ డాక్టర్‌ మృతికి సంతాపం ప్రకటిస్తూ నివాళులు ప్రకటించారు. (చదవండి : సుధా మూర్తి కూరగాయలు అమ్మారా.. నిజమెంత?)


'గుజరాత్‌కు ఈ వార్త దురదృష్టకరం. విధి నిర్వహణలో కరోనా బారిన పడి మృతి చెందిన గైనకాలజిస్ట్‌ డాక్టర్‌ విధి ఆత్మకు శాంతి చేకూరాలి.. ఒక యంగ్‌ కరోనా వారియర్‌ను కోల్పోయినందుకు చాలా బాధగా ఉంది.. ఆమె మరణం వాళ్ల కుటుంబానికి తీరని లోటు.. విధికి శాంతి చేకూరాలని.. ఆమె కుటుంబసభ్యులు మనోధైర్యంతో ఉండాలని కోరుకుంటున్నాం' అంటూ కామెంట్‌ చేశారు. అయితే విధి కరోనాతో చనిపోయిందో లేదో తెలియదు గానీ ఆమె పేరుతో వాడిన ఫోటో మాత్రం ఆమెది కాదని యాంటీ ఫేక్‌ న్యూస్‌ వార్‌ రూమ్‌ తేల్చి చెప్పింది. వాస్తవానికి ఫోటోలో ఉన్న వ్యక్తి డాక్టర్‌ విధి కాదని.. దక్షిణాది సినీ నటి, మోడల్‌ సంస్కృతి షెనాయ్‌ అని వెల్లడించింది. కాగా సంస్కృతి పలు తమిళ, మలయాళం, కన్నడ, తెలుగు చిత్రాల్లో నటించింది. ఈ విషయం తెలుసుకోవడానికి ఇండియా టుడే బృందం సంస్కృతి ఆఫీస్‌కు వెళ్లింది. 2015లో మలయాళం సినిమా అనార్కలి షూటింగ్‌ సందర్భంగా  సంస్కృతి ఆ ఫోటో దిగిందని తేలింది. (చదవండి : దీపికా, రణ్‌వీర్‌తో దావుద్‌ ఇబ్రహీం డిన్నర్‌!)

ఫోటోలో ఉన్నది నేనే : సంస్కృతి
ఇదే విషయమై సంస్కృతి తన ఫేస్‌బుక్‌ పేజీలో సెప్టెంబర్‌ 14న క్లారిటీ ఇచ్చింది. వైరల్‌గా మారిన ఫోటోలో ఉన్నది తనేనని.. గుజరాత్‌కు చెందిన విధి ఎవరో తెలీదనీ.. తన ఫోటో ఎందుకు ఆమెకు వాడారో అర్థంకాలేదన్నారు. ఈ సందర్భంగా సంస్కృతి తన ఫేస్‌బుక్‌ పేజీలో ఒక పోస్ట్‌ రాసుకొచ్చారు. ' డియర్‌ ఫ్రెండ్స్‌.. కొచ్చి నుంచి సంస్కృతి షినాయ్‌ మాట్లాడుతున్నా.  గుజరాత్‌కు చెందిన యువ వైద్యురాలు విధి కరోనా మృతి చెందారంటూ ఆమెకు నా ఫోటో వాడి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నా ఫోటో వాట్సప్‌, ఫేస్‌బుక్‌లో వైరల్‌గా మారింది. డాక్టర్‌ విధి ఎవరో నాకు తెలీదని.. ఒకవేళ ఆమె కరోనా సోకి మరణిస్తే ఆమెకె ఇవే నా ప్రగాడ సానభూతి తెలుపుతున్నా. కానీ ఆ ఫోటోలో ఉన్నది కచ్చితంగా నేనే అంటూ' కామెంట్‌ చేశారు. కాగా రివర్స్‌ ఇమేజ్‌ మ్యాపింగ్‌ ద్వారా జూన్‌ 15,2016లో సంస్కృతి ఈ ఫోటోను ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌ చేసినట్లు ఇండియా టుడే తెలిపింది. 

మరి డాక్టర్‌ విధి ఎవరు?
సినీ నటి సంస్కృతి స్వయంగా ఆ ఫోటోలో ఉన్నది తానేనని స్వయంగా వెల్లడించడంతో .. అసలు డాక్టర్‌ విధి ఉన్నారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. అయితే సెప్టెంబర్‌ 9న డాక్టర్‌ విధి పీపీఈ కిట్‌ ధరించి  పేషంట్‌ను చెక్‌ చేస్తున్న ఫోటో ఒకటి ఇండియన్‌ మెడికల్‌ స్టూడెంట్స్‌ ఆర్గనైజేషన్‌(ఐఎంఎస్‌వో) తమ ఫేస్‌బుక్‌ పేజీలో షేర్‌ చేసింది. ఈ విషయమై యాంటీ ఫేక్‌వార్‌ రూమ్‌ ఐఎంఎస్‌వో సభ్యురాలు, డాక్టర్‌ విధి స్నేహితురాలు డాక్టర్‌ శుభమ్‌ కుమారిని కలిసింది. ఈ సందర్భంగా శుభమ్‌ కుమారి మాట్లాడుతూ.. 'విధి అనే అమ్మాయి బిహార్‌ నుంచి వచ్చిన మెడికల్‌ స్టూడెంట్‌. ఇంటర్న్‌షిప్‌ పని మీద ఆమె అహ్మదాబాద్‌కు వచ్చింది. ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్‌ 9న విధి కరోనా బారిన పడిందని' తెలిపారు.అయితే సోషల్‌మీడియాలో వైరల్‌ అయిన ఫోటో మాత్రం సినీ నటి సంస్కృతిదేనని.. డాక్టర్‌ విధి కాదని రివర్స్‌ ఇమేజ్‌ మ్యాపింగ్‌ ద్వారా తేలింది. అయితే విధి కరోనాతో నిజంగా చనిపోయిందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top