సాక్షి, ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భారీ ఉగ్రదాడి కుట్రను స్పెషల్ సెల్ పోలీసులు భగ్నం చేశారు. పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐకి చెందిన నలుగురిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా నిందితుల వద్ద నుంచి భారీగా గన్స్, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన కేసులో నలుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
వివరాల మేరకు.. ఢిల్లీలో భారీ ఉగ్రదాడి కుట్రను స్పెషల్ సెల్ పోలీసులు చేధించారు. నిందితుల విచారణలో ఈ కుట్రకు సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి. పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ (ISI) హ్యాండ్లర్ షెహ్జాద్ భట్టి ఆదేశాలు మేరకు కుట్ర జరిగినట్టు పోలీసులు గుర్తించారు. అరెస్టైన వారిలో ముగ్గురు పంజాబ్కు చెందినవారు కాగా, ఒకరు ఢిల్లీకి చెందిన వ్యక్తి అని అధికారులు తెలిపారు.
కాగా, నిందితులు డ్రోన్ల ద్వారా ఆయుధాలు మరియు మాదకద్రవ్యాలు అందుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఢిల్లీలోని పోలీస్ స్టేషన్లు, ప్రార్థనా స్థలాల వద్ద రెక్కీ నిర్వహించినట్లు విచారణలో తేలింది. కాల్పుల ఘటనకు గగన్ప్రీత్ను బాధ్యుడిగా నియమించినట్లు కూడా సమాచారం బయటపడింది. ఈ కేసులో భారత శిక్షా స్మృతి (BNS), ఆర్మ్స్ యాక్ట్ కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. అరెస్ట్ అనంతరం, నిందితుల వద్ద నుంచి రెండు విదేశీ పిస్టల్స్, 9 తూటాలు, అలాగే ఐదు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ మొబైల్ ఫోన్లలో విదేశీ నంబర్లతో నిరంతర సంప్రదింపులు జరిగినట్లు దర్యాప్తులో బయటపడింది. కాగా, ఉగ్ర నెట్వర్క్పై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.


