
ఢిల్లీ: మరో ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం బయటపడింది. ఢిల్లీ నుంచి పారిస్ వెళ్ల్సాల్సిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపాన్ని గుర్తించడంతో ఆ విమానాన్ని రద్దు చేశారు. ముందుస్తు తనిఖీల్లో భాగంగా ఢిల్లీ-పారిస్ విమానంలో సమస్య ఉన్నట్లు గుర్తించారు అధికారులు. ఈ నేపథ్యంలో ఆ విమానాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
ఇప్పటికే అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం రద్దు కాగా, తాజాగా ఢిల్లీ-పారిస్ విమానాన్ని రద్దు చేశారు. మంగళవారం(జూన్ 17) నాడే మూడు ఎయిర్ ఇండియా విమానాలు సాంకేతిక లోపం కారణంగా రద్దు కావడం గమనార్హం. శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ముంబై రావాల్సిన ఎయిర్ ఇండియా విమానం, ఆ తర్వాత అహ్మదాబాద్- లండన్ ఎయిర్ ఇండియా విమానం, ఇప్పుడు ఢిల్లీ-పారిస్ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపాలు తలెత్తడంతో రద్దు చేయాల్సి వస్తుంది.
ఇటీవల జూన్ 12వ తేదీన విమాన ప్రమాదం జరిగింది. అహ్మదాబాద్ నుంచి లండన్కు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం టేకాప్ అయిన సెకన్ల వ్యవధిలోనే కుప్పకూలిపోయింది. ఇందులో 242 మంది ఉండగా ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఆ విమానం బీజే మెడికల్ హాస్టల్పై కూలిపోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగింది. అహ్మదాబాద్ ఘటన తర్వాత ఎయిర్ ఇండియా విమాన ప్రయాణం అంటేనే హడలిపోతున్నారు. అందుకు తగ్గట్టే ఆ సర్వీసుల్లోనే వరుసగా సాంకేతిక లోపాలు బయటపడటంతో మరింత భయం పుట్టిస్తోంది ప్రయాణికుల్లో. గత 48 గంటల్లో వరుసగా 9 విమానాల్లో సాంకేతిక లోపాల్ని గుర్తించారు.