కాగ్‌ రిపోర్టు మంట... ఆప్‌ సర్కార్‌పై హైకోర్టు సీరియస్‌ | Delhi High Court Serious On AAP Govt CAG Report | Sakshi
Sakshi News home page

కాగ్‌ రిపోర్టు మంట... ఆప్‌ సర్కార్‌పై హైకోర్టు సీరియస్‌

Jan 13 2025 12:11 PM | Updated on Jan 13 2025 12:32 PM

Delhi High Court Serious On  AAP Govt CAG Report

ఢిల్లీ: ఆమ్‌ ఆద్మీ ప్రభుత్వంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగ్‌ రిపోర్టు జాప్యం చేస్తున్నందుకు ఆప్‌ సర్కార్‌పై మండిపడింది. ఈ క్రమంలో ఆప్‌ నిజాయితీపై ప్రశ్నించింది. మద్యం కుంభకోణంపై ఇప్పటికే కాగ్‌ నివేదికను స్పీకర్‌కు పంపించి ఉంటే సభలో చర్చను ప్రారంభించి ఉండాలి అని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో, ఈ విషయంపై సోమవారం మధ్యాహ్నం 2:30 గంటలకు పూర్తి విచారణ జరుపనుంది.

ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఆప్‌ సర్కార్‌కు కాగ్ నివేదిక దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఢిల్లీ మద్యం విధానంలో ఆప్ అవకతవకలపై చర్చను కాగ్‌ తెరపైకి తీసుకువచ్చింది. ఢిల్లీ మద్యం విధానం లోపభూయిష్టంగా ఉందని, పాలసీ అమలులో పారదర్శకత లేదని కాగ్ తన నివేదికలో పేర్కొంది. ఈ విధానం కారణంగా రాష్ట్ర ఖజానాకు భారీ నష్టం వాటిల్లిందని వెల్లడించింది. ఇదే సమయంలో ఢిల్లీ ప్రభుత్వ మద్యం విధానం కారణంగా రాష్ట్ర ఖజానాకు 2026 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందని కాగ్ అంచనా వేసింది. అయితే, కాగ్ నివేదిక అధికారికంగా ఇంకా బయటకు రాకపోయినప్పటికీ, ఆ నివేదికలోని కొన్ని అంశాలు మీడియాలో ప్రముఖంగా వచ్చాయి.

ఈ నేపథ్యంలో కాగ్‌ నివేదికను బహిర్గతం చేయాలని హైకోర్టు ఇప్పటికే ఆప్‌ సర్కార్‌ను ఆదేశించింది. కానీ, హైకోర్టు ఆదేశాలను ఆప్‌ సర్కార్‌ బేఖాతరు చేసింది. ఇప్పటికీ కాగ్‌ నివేదికను బయటకు ఇవ్వలేదు. దీంతో, కోర్టు ఆగ్రహం వ్య​​క్తం చేసింది. ఇదిలా ఉండగా.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాగ్ నివేదిక లీక్ కావడంతో అధికార ఆప్‌ పార్టీ తీవ్ర నష్టం వాటిల్లే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులకు చెబుతున్నారు.

కాగ్‌ నివేదికలో ఏముంది? 
లీక్‌ అయిన కాగ్‌ నివేదిక ప్రకారం.. 2021 నవంబర్‌లో అమల్లోకి తెచ్చిన పాలసీని తొలుత కేబినెట్‌ నుంచి గానీ, ఆ తర్వాత లెఫ్టినెంట్‌ గవర్నర్‌ నుంచిగానీ అనుమతి తీసుకోలేదు. మద్యం విక్రయం లైసెన్సులు పొందిన లిక్కర్‌ సంస్థల ఆర్థిక స్థితిగతులు, గత చరిత్ర, పూర్వాపరాలను ప్రభుత్వం పట్టించుకోలేదు. నష్టాల్లో ఉన్న సంస్థలకూ లైసెన్సులు మంజూరుచేశారు. కొన్నింటికి లైసెన్సులను ఉద్దేశపూర్వకంగా పునరుద్ధరించారు. కీలక నిబంధనలను మార్చే సందర్భాల్లో ఢిల్లీ శాసనసభలో ప్రవేశపెట్టాలి. కానీ అలాంటిదేమీ జరగలేదు. కొందరు రిటైలర్లు ఆ విధానం ముగియకముందే తమ లైసెన్సులను ప్రభుత్వానికి సమర్పించి వెనుతిరిగారు. ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వం మళ్లీ టెండర్లు పిలవకపోవడంతో ప్రభుత్వం రూ. 890 కోట్ల ఆదా యం నష్టపోయింది.

జోనల్‌ లైసెన్సుల్లో మినహాయింపులు ఇవ్వడంతో మరో రూ.941 కోట్ల ఆదాయం తగ్గిపోయింది. కోవిడ్‌ను సాకుగా చూపి కొందరికి లైసెన్స్‌ ఫీజులను మాఫీచేయడంతో మరో రూ.144 కోట్ల ఆదాయం కోల్పోయింది. కోవిడ్‌ వంటి అనూహ్య పరిస్థితులు తలెత్తితే ఆ నష్టాలను వ్యాపారులే భరించాలన్న నిబంధన ఉన్నప్పటికీ ప్రభుత్వం దానిని పట్టించుకోలేదు. నష్టాలను చవిచూసేందుకే మొగ్గుచూపింది అని ఉండటం గమనార్హం.

Advertisement
 
Advertisement
Advertisement